Loading...
Nepal-Tibet: నేపాల్‌-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?
నేపాల్‌-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?

Nepal-Tibet: నేపాల్‌-టిబెట్‌లో భూకంపం.. మరో విపత్తు ముంచుకొస్తుందా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే వరదలు, ఆకస్మిక వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని గురువారం రాత్రి భూకంప ప్రకంపనలు వణికించాయి. నేపాల్‌లో 3.2 తీవ్రతతో, టిబెట్‌లో 5 తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి. భూకంప కేంద్రం ఖాట్మాండుకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో బ్యారియర్‌ సరస్సు కట్టలు తెగితే భారీ విపత్తు సంభవించే అవకాశం ఉందంటూ చైనా హెచ్చరించడం నేపాల్‌లో ఆందోళనను మరింత పెంచింది.

వివరాలు 

500కు చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో చోటుచేసుకున్న ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య 500కు చేరింది. గల్లంతైన వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

నేపాల్‌, టిబెట్‌ ప్రాంతాల్లో కలిపి సుమారు 1,500 మంది ఆచూకీ తెలియడం లేదు.

వీరిలో 33 దేశాలకు చెందిన 627 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. వారిలో అత్యధికంగా 300 మంది భారతీయులేనని తెలుస్తోంది.

వీరిలో చాలామంది మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారే. టెలికాం వ్యవస్థలు దెబ్బతినడంతో గల్లంతైన వారితో సంబంధాలు ఏర్పరచుకోవడం కష్టంగా మారింది.

మరోవైపు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయి.

అయితే రహదారులు తెగిపోవడం, వంతెనలు కొట్టుకుపోవడం, భారీగా బురద పేరుకుపోవడం, శిథిలాలు అడ్డుగా మారడంతో సహాయక బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

వివరాలు 

భూకంపం వల్లే వరదలా?

తొలుత ఈ విపత్తుకు భూకంపం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

అయితే తాజా భౌగోళిక విశ్లేషణలో అసలు కారణం వేరని అమెరికా జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది.

హిమనదం కూలిపోవడంతో భారీగా మంచు, రాళ్లు, మట్టి దిగువకు జారినట్లు తెలిపింది.

దీంతో నదీ ప్రవాహానికి సహజంగా అడ్డంకి ఏర్పడి.. అది ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలను ముంచెత్తినట్లు పేర్కొంది.

ఈ పరిణామమే ఆకస్మిక వరదలకు దారితీసినట్లు USGS తేల్చింది.

ADVERTISEMENT

వివరాలు 

మరో వరద ముప్పు పొంచి ఉందా?

ఇప్పటికే ఆకస్మిక వరదల విధ్వంసం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న నేపాల్‌కు మరో ముప్పు ఎదురైంది.

భోటే కోషి నదీ వ్యవస్థకు సమీపంలో కొత్తగా ఏర్పడిన బ్యారియర్‌ సరస్సులో నీటిమట్టం వేగంగా పెరుగుతున్నట్లు చైనా అధికారులు గుర్తించారు.

సహజంగా ఏర్పడిన ఈ అడ్డంకి తెగిపోతే పెద్ద మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకు ప్రవహించే ప్రమాదం ఉందని నేపాల్‌ అధికారులు హెచ్చరించారు.

దీంతో భోటే కోషి, త్రిశూలీ నదుల పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు మరో రెండు రోజుల పాటు తీవ్ర అప్రమత్తత అవసరమని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

భారతీయుల ఆచూకీపై ఆందోళన

నేపాల్‌లో చోటుచేసుకున్న విపత్తు ప్రభావం భారత్‌పైనా పడింది. సుమారు 290 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.

వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 30 మంది ఉన్నట్లు సమాచారం.

వారి ఆచూకీ తెలుసుకునేందుకు భారత అధికారులు నేపాల్‌ ప్రభుత్వంతో కలిసి అత్యవసర చర్యలు చేపడుతున్నారు.

ఇప్పటివరకు 84 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. టిబెట్‌ వైపున కూడా సుమారు 200 మంది భారతీయులు తరలింపు కోసం సహాయం కోరినట్లు తెలుస్తోంది.

వీరిలో కైలాష్‌-మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారు కూడా ఉన్నారు.

విపత్తు కారణంగా యాత్రికుల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మూడు రోజుల పాటు యాత్రను నిలిపివేశారు.

వివరాలు 

ఎటుచూసినా బురద, శిథిలాలే..

ఆకస్మిక వరదల ఉద్ధృతికి రసువా, నువాకోట్‌, ధాదింగ్‌, చిత్వన్‌ తదితర ప్రాంతాల్లో గ్రామాలు, ఇళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు కొద్దిసేపట్లోనే కొట్టుకుపోయాయి.

అనేక ప్రాంతాల్లో వంతెనలు, రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

విద్యుత్‌, టెలికాం వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు కూడా భారీ నష్టం వాటిల్లింది.

నేపాల్‌ పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా బలగాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.

హెలికాప్టర్లు, డ్రోన్లు, భూతల బృందాల సహాయంతో గాలింపు కొనసాగుతోంది.

నదీ తీరాలు, బురదలో చిక్కుకున్న ప్రాంతాలు, ఆస్పత్రులు, సహాయక శిబిరాల్లో గల్లంతైన వారి కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. మరోవైపు మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది.

వివరాలు 

విపత్తు ఇంకా ముగియలేదా?

హిమనదం కూలిపోవడం, భారీగా మంచు, రాళ్లు, మట్టి దిగువకు జారడం.. నదీ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడటం.. ఆ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ నీరు, బురద, శిథిలాలు దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లడం.. ఈ పరిణామాలే తాజా విధ్వంసానికి ప్రధాన కారణంగా గుర్తించారు.

అయితే ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన సరస్సులు, కొండచరియలు మరోసారి విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది కుటుంబాలు తమ ఆత్మీయుల కోసం ఎదురుచూస్తున్నాయి.

గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

దీంతో నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే కొనసాగుతోంది.

ADVERTISEMENT