Iran: చమురు తర్వాత ఇప్పుడు డేటా యుద్ధం?.. సముద్ర గర్భ కేబుళ్లపై పెరుగుతున్న ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది. గల్ఫ్ ప్రాంతంలో వచ్చే సంక్షోభం చమురు రవాణా మార్గాల ద్వారా కాకుండా, సముద్ర గర్భంలో ఉన్న సమాచార కేబుళ్ల ద్వారా ఉద్భవించే అవకాశముందని సూచించింది. ఈ సమాచారం గల్ఫ్ దేశాల్లో ఆందోళనలకు దారితీస్తోంది.ఇరాన్కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదికలో హర్మూజ్ జలసంధిలో ఉన్న సముద్ర గర్భ సమాచార కేబుళ్ల బలహీనతను ప్రస్తావించింది. ఒకేసారి అనేక కీలక కేబుళ్లు ప్రమాదవశాత్తు గానీ, ఉద్దేశపూర్వకంగానీ దెబ్బతింటే, పర్షియన్ గల్ఫ్ అంతటా భారీ అంతరాయాలు కలగవచ్చని హెచ్చరించింది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి, ఇప్పుడు సమాచార వ్యవస్థలకూ ముఖ్య కేంద్రంగా మారిందని పేర్కొంది.
వివరాలు
బ్యాంకింగ్, కమ్యూనికేషన్స్, క్లౌడ్ సేవల కోసం ఈ కేబుళ్లపైనే అధికంగా ఆధారపడిన గల్ఫ్ దేశాలు
ఫాల్కన్, ఏఏఈ-1, సీ-మీ-వీ వంటి అనేక ప్రధాన సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థలు ఈ ప్రాంతం గుండా సాగుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలు బ్యాంకింగ్ సేవలు, సమాచార మార్పిడి, క్లౌడ్ సేవల కోసం ఈ కేబుళ్లపై అధికంగా ఆధారపడుతున్నాయి. ఈ హెచ్చరికలకు బలం చేకూర్చే విధంగా, 2024, 2025 సంవత్సరాల్లో ఎర్ర సముద్రంలో కొన్ని కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలను నివేదిక గుర్తుచేసింది. ఆ సమయంలో ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా మరమ్మతులు పూర్తి కావడానికి నెలల సమయం పట్టింది.
వివరాలు
ఇది గల్ఫ్ దేశాలకు ఇరాన్ పంపుతున్న వ్యూహాత్మక సంకేతమన్న విశ్లేషకులు
యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా గతంలో ఇలాంటి మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించిన విషయం ప్రస్తావించింది. ఇది కేవలం అంచనా మాత్రమే కాకుండా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ పంపుతున్న వ్యూహాత్మక సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రమాదం కనిపించకపోయినా, కనిపించని కీలక సమాచార వసతుల భద్రతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.