Trump: ఒప్పందం చేసుకోండి.. లేకపోతే లొంగిపోండి!: ట్రంప్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని,లేదంటే పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ ఒకవైపు చర్చలకు ఆసక్తి చూపుతూనే, మరోవైపు బహిరంగంగా చర్చలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ..ఇరాన్ నాయకులు తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నారని, అయితే బహిరంగంగా మాత్రం అలాంటి చర్చలు లేవని చెబుతున్నారని పేర్కొన్నారు. అలాగే హర్మూజ్ జలసంధిపై తమకే పూర్తి నియంత్రణ ఉందని ఇరాన్ చెబుతున్నప్పటికీ, వాస్తవానికి ఆ ప్రాంతం పూర్తిగా అమెరికా పర్యవేక్షణలోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అనుమతి లేకుండా ఇరాన్కు ఏదీ చేరదని, ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.
వివరాలు
ఒప్పందం కుదరని పరిస్థితి ఏర్పడితే..
ఇటీవల మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా బలగాలకు ఆదేశించినట్లు వెల్లడించారు.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే అతిపెద్ద సైనిక చర్యకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, గల్ఫ్లోని మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.
ఆ దేశాల ఉన్నతాధికారులతో జరిగిన చర్చల అనంతరం ఇరాన్తో దౌత్యపరమైన చర్చలకు మరింత అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రంప్ వెల్లడించారు.
అయితే ఒప్పందం కుదరని పరిస్థితి ఏర్పడితే మళ్లీ సైనిక చర్యలకు దిగేందుకు వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు: ఇస్మాయిల్ బఘాయీ
ఇదిలా ఉండగా, ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పూర్తిగా ఖండించారు.
అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న చర్చలు హర్మూజ్ జలసంధికి అవతల ఉన్న ఒమన్తో మాత్రమేనని, అవి కూడా హర్మూజ్ గుండా తాత్కాలిక సురక్షిత నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేసే అంశానికే పరిమితమని వెల్లడించారు.
ఈ పరిణామాల మధ్య ఇరాన్పై ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
దౌత్య ప్రయత్నాలకు అవకాశం ఇస్తూనే, అవసరమైతే సైనిక చర్యలకు కూడా వెనుకాడబోమన్న అమెరికా వైఖరి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.