Hormuz: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. భారత్కు వస్తున్న ఎల్ఎన్జీ నౌకపై డ్రోన్ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కతర్ నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (ఎల్ఎన్జీ)ను తీసుకుని భారత్కు బయలుదేరిన భారీ ట్యాంకర్ నౌకపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడితో నౌకకు గణనీయమైన నష్టం వాటిల్లగా, ఇంజిన్ రూమ్లో భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. రాస్ లఫ్ఫాన్ నుంచి దహేజ్కు ప్రయాణం 'ఎల్ఎన్జీసీ అల్ రేకయ్యాత్' పేరుతో ప్రయాణిస్తున్న ఈ భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్ కతర్లోని రాస్ లఫ్ఫాన్ పోర్టు నుంచి ఎల్ఎన్జీ సరుకుతో గుజరాత్లోని దహేజ్ పోర్టు వైపు బయలుదేరింది.
వివరాలు
ఇంజిన్ రూమ్లో మంటలు.. సిబ్బంది సురక్షితం
జూలై 7న అరేబియా సముద్రం, ఒమన్ అఖాతం కలిసే సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో నౌక ఎడమ వైపున అనుమానాస్పద క్షిపణి లేదా డ్రోన్ ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. దాడి ప్రభావంతో నౌక ఇంజిన్ రూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన సమయంలో నౌకలో మొత్తం 29 మంది సిబ్బంది ఉండగా, వారిలో నలుగురు భారతీయ నావికులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం, ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశంగా మారింది.
వివరాలు
లీకేజీ లేదు.. భారత్ వైపు ప్రయాణం
దాడి జరిగినప్పటికీ సముద్రంలో ఎలాంటి చమురు లేదా ఎల్ఎన్జీ లీకేజీ సంభవించలేదని అధికారులు తెలిపారు. నౌక ప్రస్తుతం భద్రతా చర్యల మధ్య తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భారత్ వైపు వస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్కు సమాచారం అందినట్లు తెలిసింది.