Ebola: కాంగోలో మళ్లీ ఎబోలా విజృంభణ.. 65 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని మారుమూల ఇటూరి ప్రావిన్స్లో ప్రమాదకరమైన ఎబోలా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకు కనీసం 65 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అదనంగా మరో 246 అనుమానిత కేసులను కూడా గుర్తించినట్లు సమాచారం. ఆఫ్రికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. మొంగ్వాలు, ర్వాంపర ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో స్థానిక ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.
వివరాలు
ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసే అవకాశం
ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధిగా గుర్తించబడింది. వాంతులు, రక్తం, వీర్యం వంటి శరీర ద్రవాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించినప్పటికీ, ఇది ప్రాణాపాయ పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాంగోలో తొలిసారిగా 1976లో ఎబోలా వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం 17 సార్లు ఈ వైరస్ అక్కడ వ్యాపించింది. ముఖ్యంగా 2018 నుంచి 2020 మధ్యకాలంలో నమోదైన భారీ వ్యాప్తిలో దేశవ్యాప్తంగా వెయ్యి మందికిపైగా మరణించారు.