LOADING...
US-Iran: ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్‌లపై టెహ్రాన్‌ బాంబుల వర్షం
ప్రతిగా కువైట్,బహ్రెయిన్‌లపై టెహ్రాన్‌ బాంబుల వర్షం

US-Iran: ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు.. ప్రతిగా కువైట్,బహ్రెయిన్‌లపై టెహ్రాన్‌ బాంబుల వర్షం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం అమెరికా ఇరాన్‌లోని లక్ష్యాలపై మరోసారి వైమానిక దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ కువైట్‌, బహ్రెయిన్‌లపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఈ ఘటనల్లో ప్రాణనష్టం జరగనప్పటికీ, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడానికి వాషింగ్టన్‌, టెహ్రాన్‌ మధ్య కొనసాగుతున్న చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. తమపై దాడులు కొనసాగితే అమెరికాతో జరుగుతున్న చర్చలను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్‌ తాజాగా హెచ్చరించింది. మరోవైపు, ఇరాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశం ఉనికినే ప్రశ్నార్థకం చేసే చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు 

కువైట్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతిదాడులు

అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్‌లోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం మరోసారి వైమానిక దాడులు నిర్వహించారు. అమెరికా దాడులకు ప్రతిగా, ఆ దేశ సైనిక స్థావరాలు ఉన్న కువైట్‌, బహ్రెయిన్‌లపై ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌) దాడులు చేపట్టింది. ఇరాన్‌ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, రెండు బాలిస్టిక్‌ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్‌ సైన్యం వెల్లడించింది. అలాగే, ఇరాన్‌ దాడుల కారణంగా తమ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఎనిమిది అంతస్తుల భవనం ధ్వంసమైనట్లు బహ్రెయిన్‌ అధికారులు ప్రకటించారు.

వివరాలు 

హర్మూజ్‌ జలసంధిలో కొత్త ఏర్పాట్లపై ఇరాన్‌ అభ్యంతరం

హర్మూజ్‌ జలసంధిలో ఒమన్‌ తీరానికి సమీపంగా ప్రారంభించిన కొత్త సముద్ర రవాణా మార్గాన్ని మరింత విస్తరించేందుకు అమెరికా నౌకాదళం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయత్నాలపై ఇరాన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. హర్మూజ్‌ జలసంధి నిర్వహణ పూర్తిగా తమ ఆధీనంలోనే ఉండాలని ఇరాన్‌ స్పష్టం చేసింది. ఈ విషయంలో బయటి దేశాల జోక్యం లేదా నౌకల రాకపోకల కోసం కొత్త మార్గాలు,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టడం ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలు కొనసాగితే హర్మూజ్‌ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో తెరవడం మరింత ఆలస్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఇరాక్‌ పర్యటనలో భాగంగా బాగ్దాద్‌లో మాట్లాడిన సందర్భంగా అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

వివరాలు 

లెబనాన్‌లోనూ కొనసాగుతున్న ఉద్రిక్తతలు

మరోవైపు లెబనాన్‌లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని దెయిర్‌ సిరియన్‌ గ్రామంలో శనివారం రాత్రి హెజ్‌బొల్లా తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో ఓ ఇజ్రాయెల్‌ సైనికుడు మరణించినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

Advertisement