LOADING...
Jindal MSME Park: ఎస్‌.కోటలో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుకు జులై 3న శంకుస్థాపన.. రూ.3,970 కోట్ల పెట్టుబడులు
రూ.3,970 కోట్ల పెట్టుబడులు

Jindal MSME Park: ఎస్‌.కోటలో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుకు జులై 3న శంకుస్థాపన.. రూ.3,970 కోట్ల పెట్టుబడులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. ఈ పార్కుకు జులై 3న శంకుస్థాపన జరగనుంది. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లాలో నిర్వహించే ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచే వర్చువల్‌ విధానంలో ఎస్‌.కోటలోని జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పార్కులో రూ.3,970 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలను నెలకొల్పేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిశ్రమలు ఏర్పాటైతే సుమారు 45 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

రెండు దశాబ్దాల తర్వాత ప్రాజెక్టుకు ఊపిరి

ఎస్‌.కోటలో అల్యూమినియం ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జిందాల్‌ సంస్థ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం మండలంలోని ముసిడిపల్లి, చీడిపాలెం, చినఖండేపల్లి, ఎం.బి.వర, కిత్తంపాలెం గ్రామాల పరిధిలోని మొత్తం 1,164.43 ఎకరాల భూమిని కేటాయించాలని సంస్థ కోరింది. దీని కోసం అప్పటి మార్కెట్‌ విలువ ఆధారంగా 985 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు 180.73 ఎకరాల జిరాయితీ భూమిని సేకరించి జిందాల్‌ సంస్థ పేరిట ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసింది. అయితే అనంతర పరిణామాల్లో మన్యం ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాల ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవడంతో అల్యూమినియం కర్మాగారం నిర్మాణాన్ని జిందాల్‌ సంస్థ ఉపసంహరించుకుంది. అనంతరం అదే భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

వివరాలు 

భూములు కోల్పోయిన నిర్వాసిత రైతుల ఆందోళనలు

ఈ ప్రతిపాదనకు 2023లో అప్పటి వైకాపా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.అవసరమైన అనుమతుల కోసం సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తుండగానే ఎన్నికల ప్రకటన రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలతో జిందాల్‌ యాజమాన్యం పలుమార్లు సమావేశమై ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అంశంపై చర్చలు జరిపింది. ఇదే సమయంలో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతులు నష్టపరిహారాన్ని పెంచాలని, గిరిజన రైతులకు న్యాయం చేయాలని చాలా కాలం పాటు ఆందోళనలు నిర్వహించారు. ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వంగలపూడి అనిత రైతులతో సమావేశమై వారి సమస్యలకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళనను విరమించారు. దీంతో ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమై, జులై 3న శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Advertisement