Pak-Afg: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో వైమానిక దాడి.. 29 మంది హతం..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ భద్రతా దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కు చెందిన 29 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఉగ్రవాదుల రహస్య స్థావరాలు, సురక్షిత ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తారర్ తెలిపారు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస ఉగ్రదాడులకు ప్రతిస్పందనగా ఈ సైనిక చర్య చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కొన్నేళ్లుగా పాకిస్థాన్లో పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ దాడుల వెనుక తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ), దాని అనుబంధ ఉగ్ర సంస్థలే ఉన్నాయని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
వివరాలు
కరాచీ దాడికి ప్రతీకారం తీర్చుకున్న పాక్
ఇటీవల కరాచీలోని పారామిలిటరీ రేంజర్స్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. తుపాకులు,పేలుడు పదార్థాలతో జరిపిన ఈ దాడిలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చగా, మరో వ్యక్తిని సజీవంగా అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టైన వ్యక్తిని అఫ్గానిస్థాన్కు చెందిన పౌరుడిగా అధికారులు గుర్తించారు. ఈ దాడికి తామే బాధ్యులమని టీటీపీ అనుబంధ సంస్థ జమాత్-ఉల్-అహ్రార్ తర్వాత ప్రకటించింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ చర్యలో టీటీపీ రహస్య స్థావరాలు, సురక్షిత కేంద్రాలపై వైమానిక దాడులు నిర్వహించడంతో 29 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఇస్లామాబాద్-కాబూల్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు
తాజా సైనిక చర్యతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న ఇస్లామాబాద్-కాబూల్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య భద్రతా అంశాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాంతీయ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.