Fire aboard USS Gerald R Ford: జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ నౌకలో అగ్నిప్రమాదం.. 30 గంటల పాటు మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్లో భాగంగా అమెరికాకు చెందిన విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్ర సముద్రంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ నౌకలో ఇటీవల చోటుచేసుకున్న అగ్నిప్రమాదం విషయం ఆలస్యంగా బయటపడింది. ఈ ఘటనను ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ వెల్లడించగా, అమెరికా సైనిక అధికారులు కూడా ధృవీకరించారు.
వివరాలు
నౌకలో భారీ అగ్నిప్రమాదం
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, సుమారు వారం రోజుల క్రితం నౌకలోని ప్రధాన లాండ్రీ విభాగంలో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వెంటిలేషన్ డక్టుల ద్వారా ఇతర విభాగాలకు వ్యాపించాయి. దాంతో నౌకలోని పలు ప్రాంతాల్లో దాదాపు 30 గంటల పాటు అగ్నికీలలు రగిలాయి. ఈ ఘటనలో నౌకలో ఉన్న అమెరికా సైనికులు, నావికులు విష వాయువులను పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో సుమారు 4,500 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మంటల వల్ల సుమారు 600 మంది సెయిలర్ల పడకలు దగ్ధమయ్యాయి. దాదాపు 30 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
వివరాలు
ఆపరేషన్పై ప్రభావం లేదు
అగ్నిప్రమాదం తీవ్రంగా జరిగినప్పటికీ, నౌకకు పెద్ద నష్టం జరగలేదని అమెరికా సైన్యం తెలిపింది. ప్రస్తుతం విమాన వాహక నౌక పూర్తిస్థాయిలో సేవలందిస్తోందని వెల్లడించింది. అస్వస్థతకు గురైన సిబ్బందికి వైద్య చికిత్స అందిస్తున్నామని, దెబ్బతిన్న కంపార్ట్మెంట్లను పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
వివరాలు
దీర్ఘకాల మోహరింపు ప్రభావం
సాధారణంగా అమెరికా విమాన వాహక నౌకలు సుమారు ఏడు నెలలపాటు సముద్రంలో మోహరించి ఉంటాయి. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల దృష్ట్యా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ దాదాపు పది నెలలుగా నిరంతరం సముద్రంలోనే విధులు నిర్వర్తిస్తోంది. మొదట ఈ నౌక మధ్యధరా సముద్రంలో పనిచేసింది. అనంతరం వెనెజువెలా పరిణామాల సమయంలో కరేబియన్ ప్రాంతానికి మళ్లించారు. తరువాత ఇరాన్తో ఉద్రిక్తతలు పెరగడంతో పశ్చిమాసియా వైపు తరలించారు. ప్రస్తుతం ఈ నౌక ఎర్ర సముద్రం నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా పోర్టు వైపు కదులుతున్నట్లు సమాచారం. ఎక్కువ కాలం పాటు సముద్రంలో మోహరించి ఉండటం వల్ల నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు వెల్లడించారు.