Artificial Intelligence: ఏఐపై 'గాడ్ఫాదర్' కీలక హెచ్చరిక.. నియంత్రణలో ఉంటుందో లేదో ఎవరికీ తెలియదు!
ఈ వార్తాకథనం ఏంటి
'ఏఐ గాడ్ఫాదర్'గా పేరొందిన ఏఐ మార్గదర్శకుడు జెఫ్రీ హింటన్.. సూపర్ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థల అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న పిలుపులకు మద్దతు తెలిపారు. ఇలాంటి అత్యంత తెలివైన ఏఐ వ్యవస్థలను నియంత్రించగలమో లేదో ఎవరికీ తెలియదని ఆయన హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఏఐపై వ్యక్తమవుతున్న ఆందోళనలను తోసిపుచ్చారు. చైనాపై ఏఐ రేసులో అమెరికా తప్పనిసరిగా గెలవాల్సిందేనని స్పష్టం చేశారు. బ్రిటిష్-కెనడియన్ కాగ్నిటివ్ సైకాలజిస్ట్, కంప్యూటర్ సైంటిస్ట్ అయిన జెఫ్రీ హింటన్.. ఏఐ సంస్థలు అభివృద్ధి వేగాన్ని తగ్గించాలంటూ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ చేసిన పిలుపును సమర్థించారు.
వివరాలు
దేశీయ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం
ఏబీసీ రేడియో నేషనల్ బ్రేక్ఫాస్ట్తో మాట్లాడిన హింటన్.. అమోడెయ్ హెచ్చరిక చాలా సహేతుకమైనదని పేర్కొన్నారు. ఏఐని పూర్తిగా మన నియంత్రణలో ఉంచగలమా లేదా అనే విషయం దాదాపు ఎవరికీ తెలియదని చెప్పారు.
చైనాకు చెందిన అగ్రశ్రేణి ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఏఐ దుర్వినియోగం, ఆయుధీకరణ దేశ భద్రతకు ముప్పుగా మారవచ్చని హెచ్చరించారు.
చైనాకు చెందిన రాజకీయ, సంస్థాగత, సిద్ధాంతపరమైన భద్రతకు ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు.
గూగుల్ డీప్మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, ఆల్ఫాబెట్ చీఫ్ సైంటిస్ట్ డెమిస్ హసాబిస్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్న ఆంత్రోపిక్ సీఈఓ వ్యాఖ్యల్లో కొన్ని అంశాలను మరింత స్పష్టంగా రూపొందించాల్సి ఉందన్నారు.
వివరాలు
ఏఐని నియంత్రించగలమా?
ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ వల్ల ఎదురయ్యే ప్రమాదాల అవకాశాలను అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని జెఫ్రీ హింటన్ అన్నారు. ఓ ఆంత్రోపిక్ ఉద్యోగి ఈ ప్రమాదం 10 శాతం ఉండొచ్చని చెప్పారని గుర్తుచేశారు.
అయితే వాస్తవంగా ఎంత శాతం అవకాశం ఉందో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. ''ఇది ఒక శాతం కాదు.. అంతకంటే ఎక్కువ.
అదే సమయంలో 99 శాతం కూడా కాదు.. అంతకంటే తక్కువ. ప్రాథమికంగా ప్రజలు తమ అంచనాలు, భావనల ఆధారంగానే ఈ విషయాలను చెబుతున్నారని హింటన్ పేర్కొన్నారు.
మనుషుల కంటే తెలివైన ఏఐ సూపర్ ఇంటెలిజెంట్ వ్యవస్థలు వచ్చే దశాబ్దంలోనే అందుబాటులోకి వస్తాయని ఎక్కువ మంది నిపుణులు భావిస్తున్నారని ఆయన తెలిపారు.
వివరాలు
చైనా ఇంటెలిజెన్స్ అధికారి ఏమన్నారు?
చైనా స్టేట్ సెక్యూరిటీ మంత్రి చెన్ యిక్సిన్ కూడా ఏఐ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఆదివారం అధికారిక 'చైనా సైబర్స్పేస్' మ్యాగజైన్లో ప్రచురించిన కథనంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
ప్రత్యర్థులు ఏఐని దుర్వినియోగం చేస్తే.. అది నేరుగా చైనా రాజకీయ భద్రత, సంస్థాగత భద్రత, సిద్ధాంతపరమైన భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
వ్యవస్థల్లోని లోపాలను గుర్తించడంతో పాటు.. ఆ బలహీనతలను ఉపయోగించుకునే మాల్వేర్ లేదా సాఫ్ట్వేర్ను రూపొందించే సామర్థ్యం ఏఐకి పెరుగుతోందని కూడా ఆయన హెచ్చరించారు.
వివరాలు
ఆందోళనలను తోసిపుచ్చిన ట్రంప్
మరోవైపు ఏఐపై వ్యక్తమవుతున్న ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. చైనాతో పోలిస్తే ఏఐలో అమెరికా ముందంజలో ఉందని ఆయన అన్నారు.
ఐర్లాండ్లోని డూన్బెగ్లో తన గోల్ఫ్ క్లబ్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ''ఏఐలో మనం చైనా కంటే ముందున్నాం.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన దేశం మనదే. నిజాయతీగా చెప్పాలంటే అది అలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏఐలో ఎవరు గెలిస్తే.. వారే గెలిచినట్లేనని వ్యాఖ్యానించారు.
ఏఐ అభివృద్ధికి కొన్ని నియంత్రణలు, భద్రతా చర్యలు తీసుకోవచ్చని, అయితే జరగని విషయాలను కూడా కొందరు ప్రతికూల శక్తులు ప్రస్తావిస్తున్నారని ట్రంప్ అన్నారు.
వివరాలు
ఆంత్రోపిక్ సీఈఓ ఏం హెచ్చరించారు?
ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కూడా ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని ఆ పరిశ్రమను కోరారు.
ఫ్రాంటియర్ ఏఐ అభివృద్ధిని నెమ్మదించడంతో పాటు భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు మూడు అంశాలతో కూడిన ప్రణాళికను ఆయన వివరించారు.
మొదటి దశలో భాగంగా.. ఆంత్రోపిక్ తన ఏఐ వ్యవస్థలకు థర్డ్-పార్టీ మూల్యాంకన సంస్థలకు శాశ్వతంగా ఉద్యోగి స్థాయి యాక్సెస్ ఇవ్వనుంది.
తద్వారా అవి స్వతంత్రంగా భద్రతా చర్యలను అంచనా వేయడం, ప్రమాదకర ఘటనలను నివేదించడం, శిక్షణ సమయంలో మోడల్ అలైన్మెంట్ను పరిశీలించడం చేయగలవు.
''ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మెరుగుపరిచే వేగాన్ని మనం తగ్గించాలని అమోడెయ్ పేర్కొన్నారు.
వివరాలు
మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి
ఏఐ అభివృద్ధిని జాగ్రత్తగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యంగా ఆంత్రోపిక్తో పాటు పరిశ్రమలోని ఇతర సంస్థలు కూడా ఇదే తరహా పురోగతిని సాధిస్తున్న సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఆంత్రోపిక్, ఓపెన్ఏఐలో గతంలో పనిచేసిన ఉద్యోగి జాకబ్ కాక్సన్ ఆన్లైన్లో చేసిన ఓ పోస్టులో.. ఆయా సంస్థల్లోని పరిశోధకులు ''ఏఐ మొత్తం మానవాళిని అంతం చేయగలదని నమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఆంత్రోపిక్ సీఈఓ వ్యాఖ్యల అనంతరం ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా ఏఐ ఫ్రాంటియర్ అభివృద్ధికి తగిన వేగాన్ని పాటించాల్సిన అవసరంతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
డారియో చెప్పింది సరైనదే
గత కొన్ని వారాలుగా ఓపెన్ఏఐలో ఇది ప్రధాన చర్చనీయాంశంగా ఉందని చెప్పారు.
అంతేకాకుండా స్వతంత్ర మూల్యాంకన సంస్థలకు ఉద్యోగుల తరహా యాక్సెస్ ఇవ్వాలన్న అమోడెయ్ ప్రతిపాదనకు కూడా ఆల్ట్మన్ మద్దతు తెలిపారు.
''మేము కూడా అదే చేస్తాం'' అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎలాన్ మస్క్ సంక్షిప్తంగా స్పందిస్తూ.. ''డారియో చెప్పింది సరైనదే'' అని పేర్కొన్నారు.