Staight of Hormoz: హర్మూజ్లో ఉద్రిక్తతలు: నౌకలపై కాల్పులు, రెండింటిని స్వాధీనం చేసుకున్న ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కఠిన చర్యలకు దిగింది. ఈ నేపథ్యంలో హర్మూజ్ సముద్ర మార్గంలో ఈ ఉదయం పలు నౌకలపై కాల్పులు జరిపింది. ప్రస్తుతం రెండు నౌకలు తమ ఆధీనంలోనే ఉన్నాయని ఐఆర్జీసీ వెల్లడించింది. వీటిలో ఒక నౌక గుజరాత్లోని ఓ పోర్టుకు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పనామా జెండాతో నడుస్తున్న ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా,లైబీరియా జెండాతో ఉన్న ఎపామినోండాస్ సరుకు నౌకలను తమ అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ మాధ్యమాలు వెల్లడించాయి. అలాగే గ్రీస్కు చెందిన యుఫోరియా అనే మరో నౌకను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది.
వివరాలు
ట్రాకింగ్ చేసే వ్యవస్థల ప్రకారం..
ఆ నౌక ప్రస్తుతం ఇరాన్ తీర ప్రాంతంలోనే ఉన్నట్లు సమాచారం. సముద్ర రవాణా కదలికలను గమనించే వ్యవస్థల వివరాల ప్రకారం, ఎపామినోండాస్ నౌక దుబాయ్ నుంచి గుజరాత్లోని ముంద్రా పోర్టు వైపు ప్రయాణిస్తోంది. అయితే ఆ నౌకకు అవసరమైన అనుమతులు లేవని, తన మార్గ నిర్దేశక వ్యవస్థను మార్చుకొని ప్రయాణిస్తున్నట్లు గుర్తించినట్లు ఇరాన్ నౌకాదళం పేర్కొంది.