LOADING...
Hafiz Saeed: బంగ్లాదేశ్‌లో హఫీజ్ సయీద్ సహచరుడు.. నిఘా వర్గాల హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో హఫీజ్ సయీద్ సహచరుడు.. నిఘా వర్గాల హెచ్చరిక

Hafiz Saeed: బంగ్లాదేశ్‌లో హఫీజ్ సయీద్ సహచరుడు.. నిఘా వర్గాల హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 28, 2025
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్‌ (Muhammad Yunus) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశం-భారత్‌ సంబంధాలు కఠినతరం అవుతున్నాయి. దీని ఫలితంగా బంగ్లాదేశ్‌-పాకిస్థాన్‌ మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నడుమ పాక్‌ ఉగ్రసంస్థ లష్కరే తయ్యిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ (Hafiz Saeed) కు సన్నిహితుడైన ఇబ్తిసామ్ ఇలాహీ జహీర్‌ (Ibtisam Elahi Zaheer) ఇటీవల బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లాడు. ఆయనతో పాటు మరికొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 25న జహీర్‌ ఢాకాకు చేరుకున్న అనంతరం, భారత్‌ సరిహద్దు ప్రాంతాల్లోని అనేక బంగ్లా పట్టణాలను సందర్శించినట్లు సమాచారం.

వివరాలు 

మరో పన్నెండు రోజులు బంగ్లాలో జహీర్‌ 

ఈ పర్యటనలో ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసినట్లు, అంతేకాక కశ్మీర్‌ అంశాన్ని కూడా ప్రస్తావించినట్లు నిఘా సంస్థలు పేర్కొన్నాయి. హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన జహీర్‌ బంగ్లాలో మరో పన్నెండు రోజులు ఉండనున్నాడు. నవంబర్‌ 6-7 తేదీల్లో రాజ్‌షాహీలో జరగనున్న పెద్ద ఇస్లామిక్‌ సదస్సులో ఆయన పాల్గొననున్నారని సమాచారం. యూనస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది జహీర్‌ రెండోసారి బంగ్లాదేశ్‌ పర్యటన. గత ఫిబ్రవరి 2025లో కూడా ఆయన వారం రోజులు ఆ దేశంలో గడిపాడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తన ప్రభావాన్ని వేగంగా విస్తరించుకుంటున్నాడని గూఢచార వర్గాలు గుర్తిస్తున్నాయి.

వివరాలు 

ఈశాన్య భారత్‌పై కుట్ర 

ఇదే సమయంలో పాకిస్థాన్‌ జనరల్‌ షంషాద్ మీర్జా కూడా ఇటీవల బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లారు. భారతదేశంలో మనీలాండరింగ్‌ మరియు ఇతర నేరాల కేసుల్లో నిందితుడై విదేశాలకు పారిపోయిన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌ కూడా త్వరలో బంగ్లాదేశ్‌ చేరనున్నట్లు సమాచారం. యూనస్‌ ప్రభుత్వం పాక్‌ జనరల్‌కు 'Art of Triumph' అనే పుస్తకాన్ని బహుమతిగా అందించింది. ఆ పుస్తక ముఖచిత్రంలో భారత్‌కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌ భూభాగంలో భాగంగా చూపించే తప్పుడు మ్యాప్‌ ముద్రించబడింది. ఈ పరిణామాలు భారత్‌ వ్యతిరేక శక్తులు బంగ్లాదేశ్‌లో ఒకేచోట కేంద్రీకృతమవుతున్నాయనే ఆందోళనను పెంచుతున్నాయి. ఈశాన్య భారతంపై ఏదైనా కుట్ర జరుగుతోందేమోనని భారత నిఘా సంస్థలు అప్రమత్తంగా పరిశీలిస్తున్నాయి.