Bangladesh: బంగ్లాదేశ్లో హిందూ కార్మికుడి దారుణ హత్య..రెండు వారాల్లో మూడో ఘటన
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్లోని మైమెన్సింగ్ జిల్లాలో ఉన్న ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ కార్మికుడు తన సహోద్యోగి కాల్పుల్లో మృతి చెందాడు. గత రెండు వారాల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఇది మూడో హత్యగా నమోదైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం సాయంత్రం సుమారు 6.45 గంటల సమయంలో లబీబ్ గ్రూప్కు చెందిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బజేంద్ర బిస్వాస్ (42)గా గుర్తించగా, కాల్పులు జరిపిన నోమన్ మియా (29)ను పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలు
ఇద్దరూ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు
పోలీసులు,ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, ఇద్దరూ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ, అదే ప్రాంగణంలోని అన్సార్ బ్యారక్స్లో నివసిస్తున్నారు. అయితే వారిద్దరూ ఫ్యాక్టరీ బారక్లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో భద్రత కోసం ఉపయోగించే తుపాకీని బిశ్వాస్ వైపు గురిపెట్టడంతో అనుకోకుండా చేయి ట్రిగర్కు తాకి తుపాకీ పేలి, బుల్లెట్ అతడి ఎడమ కాలికి తగిలిందని నోమన్ మియా పేర్కొన్నాడు. తీవ్రంగా గాయపడిన బిస్వాస్ను వెంటనే భలుకా ఉపజిల్లా హెల్త్ కాంప్లెక్స్కు తరలించగా, అక్కడ చికిత్స అందించేలోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాలు
హిందువుల భద్రతపై ఆందోళన
బంగ్లాదేశ్లో కొనసాగుతోన్న అల్లర్లలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్పై అల్లరిమూకలు దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవకముందే ఇటీవల మరో హిందూ యువకుడిని రాజ్బరి జిల్లా పంగ్షా సర్కిల్లో గ్రామస్థులు కొట్టి చంపారు. తాజాగా మరో హత్య చేటుచేసుకోవడంతో ఆ దేశంలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.