అమెరికాను మళ్లి కలవరపెడుతున్న కరోనా; పెరుగుతున్న ఆస్పత్రిలో చేరికలు, సీడీసీ హెచ్చరిక
అమెరికాలో కరోనా మరోసారి కలవరపెడుతోంది. కరోనాతో యూఎస్లో ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతోందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) హెచ్చరించింది. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్యలో 10శాతం పెరుగుదల సంభవించినట్లు సీడీసీ చెబుతోంది. డిసెంబర్ 2022 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. జులై రెండో వారంలో 7,100 మందికి పైగా కోవిడ్ రోగులు ఆసుపత్రిలో చేరినట్లు డేటా వెల్లడించింది. గత వారం ఈ సంఖ్య 6,444గా ఉంది. ఐసీయూలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. జులై 21వరకు దాదాపు 0.73% మంది కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు. జూన్లో ఈ సంఖ్య 0.49%గా ఉంది.
ఏడు నెలల తర్వాత పెరుగుతున్న కేసులు
అమెరికాలో సుమారు ఏడు నెలల స్థిరమైన క్షీణత తర్వాత మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు అట్లాంటాలోని సీడీసీ మేనేజర్ డాక్టర్ బ్రెండన్ జాక్సన్ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా కరోనా కేసులు పెరుగుతుండటాన్ని తాము గమనించినట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య పెరుగుదలను ఈ వారం గమనించినట్లు వెల్లడించారు. వేసవి ఆలస్యంగా ప్రారంభం కావడం కూడా దీనికి కారణం కావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగ్నేయ అమెరికాలో కేసుల పెరుగుదల గణనీయంగా ఉందని బ్రెండన్ జాక్సన్ చెప్పారు. ఆసియాలో ఉత్పన్నమవుతున్న ఉత్పరివర్తన సబ్వేరియంట్లు చాలా ఆందోళన కలిగిస్తాయని ఆయన అన్నారు.