Loading...
Balen Shah: బాలెన్ షా రాజకీయ ఇమేజ్‌కు వరుస సవాళ్లు.. 150 రోజుల్లో మారిన నేపాల్ రాజకీయాలు
బాలెన్ షా రాజకీయ ఇమేజ్‌కు వరుస సవాళ్లు.. 150రోజుల్లో మారిన నేపాల్ రాజకీయాలు

Balen Shah: బాలెన్ షా రాజకీయ ఇమేజ్‌కు వరుస సవాళ్లు.. 150 రోజుల్లో మారిన నేపాల్ రాజకీయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర 'బాలెన్‌' షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. పాత రాజకీయ వ్యవస్థపై విసుగుతో ఉన్న యువతకు ఒకప్పుడు ఆశాకిరణంగా కనిపించిన ఆయనపై ఇప్పుడు అదే యువత నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జెన్‌జీ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన బాలెన్‌ షా.. అధికారంలోకి వచ్చిన 150రోజులకే తన రాజకీయ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మాజీ అండర్‌గ్రౌండ్‌ ర్యాపర్‌గా, సివిల్‌ ఇంజినీర్‌గా, ఆ తర్వాత ఖాట్మండు మేయర్‌గా బాలెన్‌ షా తనదైన ముద్ర వేశారు. సంప్రదాయ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఆయన.. మార్చి ఎన్నికల్లో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించి సంచలనం సృష్టించారు.

వివరాలు 

వరుస నిర్ణయాలతో పెరిగిన అసంతృప్తి

బాలెన్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) భారీ మెజార్టీ సాధించడంతో నేపాల్‌లో కొత్త రాజకీయ శకం మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అవినీతిపై పోరాటం చేస్తారని, రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తారని నమ్మిన యువత బాలెన్‌కు అండగా నిలిచింది.

అయితే అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తి క్రమంగా పెరిగింది.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలెన్‌ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ నిబంధనలను కఠినతరం చేయడం తొలి పెద్ద వివాదంగా మారింది.

ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారత్‌పై ఆధారపడుతుంటారు.

వివరాలు 

భారత్‌తో సరిహద్దు వివాదం

మందులు, నిత్యావసర వస్తువుల రాకపై ప్రభావం పడటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పరిస్థితి తీవ్రం కావడంతో ప్రభుత్వం చివరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

ఆ తర్వాత భారత్‌తో సరిహద్దు వివాదంపై బాలెన్‌ చేసిన వ్యాఖ్యలు నేపాల్‌లో రాజకీయ చర్చకు దారితీశాయి.

కాలాపాని, లిపులేఖ్‌, లింపియాధురా ప్రాంతాలకు సంబంధించిన వివాదాన్ని మూడో పక్షం సహకారంతో పరిష్కరించుకోవచ్చన్న సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో కనిపించాయి.

దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పించాయి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం సరైన వైఖరి అవలంబించడం లేదని ఆరోపించాయి.

ADVERTISEMENT

వివరాలు 

భారత్‌ అంశంలో మారిన వైఖరి

విదేశీ ప్రతినిధులతో సమావేశాల విషయంలో బాలెన్‌ తొలుత కఠిన వైఖరిని ప్రదర్శించారు.

మంత్రుల స్థాయి కంటే తక్కువ హోదాలో ఉన్న అధికారులతో సమావేశం కావడానికి తాను ఆసక్తి చూపబోనని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఆ తర్వాత తన వైఖరిలో మార్పు వచ్చింది. భారత, చైనా రాయబారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఇదే సమయంలో ఆర్‌ఎస్‌పీ అధినేత రవి లామిచ్చానేకు భారత్‌లో లభించిన ప్రాధాన్యం కూడా నేపాల్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

లామిచ్చానే భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో సమావేశమయ్యారు. ఈ పరిణామం నేపాల్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.

ADVERTISEMENT

వివరాలు 

సొంత పార్టీతోనూ దూరం?

బాలెన్‌ షా పాలనా విధానంపై వస్తున్న మరో ప్రధాన విమర్శ.. ఆయన పార్లమెంట్‌తో పాటు సొంత పార్టీ కార్యకలాపాలకు కూడా తగినంత సమయం కేటాయించడం లేదన్నదే.

ప్రధాని అయిన తర్వాత పార్లమెంట్‌ సమావేశాలకు పరిమితంగా మాత్రమే హాజరవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ప్రజా సమస్యలపై సభలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి ఆయన తప్పించుకుంటున్నారని విమర్శించాయి.

మరోవైపు ఆర్‌ఎస్‌పీ సమావేశాల్లోనూ బాలెన్‌ పాల్గొనడం తగ్గిందన్న చర్చ మొదలైంది.

దీంతో బాలెన్‌ షా, పార్టీ నాయకత్వం మధ్య దూరం పెరుగుతోందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

యువతే తిరగబడిన వేళ..

బాలెన్‌ షా రాజకీయ ఇమేజ్‌కు జూలైలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఖాట్మండులో మున్సిపల్‌ పోలీసుల చర్యలపై అసంతృప్తితో రైడ్‌ షేర్‌ డ్రైవర్‌ గణేష్‌ నేపాలి ఆత్మాహుతికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఈ ఘటన తర్వాత ప్రభుత్వ తీరుపై ప్రజల్లో ఆగ్రహం మరింత పెరిగింది.

అనధికార నివాసాల తొలగింపు, పేదలకు తగిన పునరావాసం కల్పించకపోవడం వంటి అంశాల్లోనూ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది.

ఒకప్పుడు బాలెన్‌ షాకు మద్దతుగా రోడ్లపైకి వచ్చిన యువతే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను నిలదీయడం ప్రారంభించింది. ఇది ఆయనకు రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది.

వివరాలు 

మత ఘర్షణలతో మరింత ఒత్తిడి

జూలై చివర్లో నేపాల్‌ దక్షిణ ప్రాంతాల్లో హిందూ-ముస్లిం వర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు బాలెన్‌ ప్రభుత్వానికి మరో పరీక్షగా మారాయి.

ఈ ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బాలెన్‌ తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి వచ్చింది.

ప్రజా ఉద్యమాల నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన బాలెన్‌ షాకు.. పాలన మాత్రం అంత సులభం కాదని తొలి 150 రోజుల పరిణామాలు స్పష్టం చేశాయి.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుసరించిన పోరాట విధానాన్ని అధికారంలో కొనసాగించడం అంత తేలిక కాదు.

వివరాలు 

మత ఘర్షణలతో మరింత ఒత్తిడి

ప్రజల అంచనాలను అందుకోవడం, ప్రభుత్వ వ్యవస్థలను సమర్థంగా నడపడం, రాజకీయ పార్టీలతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాలు ఇప్పుడు ఆయన ముందున్న కీలక సవాళ్లు. జెన్‌జీ ఆశల నాయకుడిగా ఎదిగిన బాలెన్‌ షా.. ఇప్పుడు అదే తరం నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన దశకు చేరుకున్నారు.

కేవలం ఐదు నెలల్లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు.. రాజకీయాల్లో ప్రజాదరణ ఎంత వేగంగా పెరుగుతుందో, అదే విధంగా పరిస్థితులు మారితే అంతే వేగంగా తగ్గిపోవచ్చన్న విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

ADVERTISEMENT