IND-US Interim Trade Agreement: సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం.. భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం (IND-US Interim Trade Agreement) ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందానికి చట్టబద్ధంగా తుదిరూపు ఇవ్వడానికి సోమవారం జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్, డీసీలో ఇరుదేశాల ప్రతినిధులు సమావేశం కావాల్సి ఉండగా, ఈ షెడ్యూల్ను రీషెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ దేశాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు ఇచ్చింది. ఆ టారిఫ్లు చెల్లవని స్పష్టం చేయడంతో, తాజా పరిణామాల నేపథ్యంలోనే ఇండియా-అమెరికా చర్చలను వాయిదా వేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Details
కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది
ఇరు దేశాలకు అనుకూలమైన కొత్త తేదీలను ఖరారు చేసి చర్చలను మళ్లీ నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్, తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. అనంతరం వాటిని 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటిస్తూ, ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. భవిష్యత్తులో చట్టబద్ధమైన టారిఫ్లను మరింతగా అమలు చేస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ (US-India Trade Deal)లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.