US think tank: 2026లో భారత్-పాకిస్తాన్,పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు? - అమెరికా థింక్ట్యాంక్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
2026లో భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ థింక్ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది. ఈ ప్రమాదాన్ని "మోస్తరు అవకాశం"గా, అలాగే అమెరికా ప్రయోజనాలపై "మోస్తరు ప్రభావం"గా CFR తన తాజా నివేదికలో పేర్కొంది. 'కాన్ఫ్లిక్ట్స్ టు వాచ్ ఇన్ 2026' అనే నివేదికలో, ప్రాంతీయ అస్థిరతకు పాకిస్తాన్ ఇంకా కారణమవుతోందని CFR స్పష్టం చేసింది. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం వల్ల భారత్-పాకిస్తాన్ మధ్య మళ్లీ సాయుధ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు యుద్ధం
ఈ అంచనా వెలువడటానికి కొన్ని నెలల ముందు,మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాకిస్తాన్ మద్దతుతో ఉన్న ఉగ్రవాదులు పహల్గాంలో 26మంది పౌరులను హతమార్చిన నేపథ్యంలో, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసింది. ఆ తర్వాత కాల్పుల విరమణకు పాకిస్తాన్ పిలుపునిచ్చినా, అక్కడి నేతలు మాత్రం ప్రేరేపించే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారని నివేదిక గుర్తుచేసింది. భారత భద్రతా సంస్థలు కూడా ముప్పు ఇంకా తగ్గలేదని హెచ్చరిస్తున్నాయి. మే నెల తర్వాత జమ్ముకశ్మీర్లో పెద్ద ఉగ్రదాడి జరగకపోయినా, శీతాకాలంలో జమ్మూ ప్రాంతంలో 30 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చురుగ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
వివరాలు
పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లోనూ పరిస్థితి అస్థిరంగానే ఉంది: CFR
ఇది ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ఇంకా ఒక విధానంగా ఉపయోగిస్తున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తోందని నివేదిక పేర్కొంది. ఇక పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దుల్లోనూ పరిస్థితి అస్థిరంగానే ఉందని CFR తెలిపింది. 2026లో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సాయుధ ఘర్షణలు జరగే అవకాశం ఉందని అంచనా వేసింది. సరిహద్దులు దాటుతూ ఉగ్రవాదుల దాడులు పెరగడం ఇందుకు కారణమవుతుందని, అయితే దీని వల్ల అమెరికా ప్రయోజనాలపై ప్రభావం తక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. ఈ హెచ్చరికలు, గత వారం అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) విడుదల చేసిన నివేదికకు అనుగుణంగానే ఉన్నాయి. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద నెట్వర్క్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, సరిహద్దు ఉగ్రవాదం దక్షిణాసియాను అస్థిరపరచే ప్రమాదం ఉందని పెంటగాన్ కూడా పేర్కొంది.
వివరాలు
ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు
పాకిస్తాన్ తన భూభాగంలో పనిచేస్తున్న ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించలేకపోవడం వల్ల, భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే, CFR,పెంటగాన్ నివేదికలు 2026లో పాకిస్తాన్ చుట్టుపక్కల ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలున్నాయని సూచిస్తున్నాయి. తీవ్రవాద గ్రూపులపై ఇస్లామాబాద్ చూపుతున్న సడలింపు ధోరణే ఈ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణంగా మారుతోందని ఈ నివేదికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.