Javelin anti-tank missile: భారత్కు జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థ.. అమెరికా రాయబారి కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ కొనుగోలు కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. యుద్ధాల్లో ఇప్పటికే సమర్థతను నిరూపించుకున్న జావెలిన్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపుతోందని తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. భవిష్యత్తులో ఈ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థలను భారత్, అమెరికా కలిసి అభివృద్ధి చేసే ప్రణాళిక కూడా ఉన్నట్లు వెల్లడించారు.
వివరాలు
జావెలిన్ ప్రత్యేకత ఏమిటంటే..
జావెలిన్ ఒక పోర్టబుల్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థ. దీన్ని లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది.
ప్రధానంగా ఆర్మర్డ్ వాహనాలు, ఇతర రక్షిత లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు దీన్ని వినియోగిస్తారు.
అమెరికాతో పాటు దాని మిత్రదేశాల సైన్యాలు కూడా ఈ వ్యవస్థను గతంలో యుద్ధాల్లో ఉపయోగించాయి.
భుజంపై మోసుకెళ్లేలా దీని రూపకల్పన చేశారు. ఆటోమేటిక్ మెకానిజం సాయంతో లక్ష్యాన్ని గుర్తించి దానిపైకి క్షిపణిని ప్రయోగించవచ్చు.
దీంతో జావెలిన్ ఆపరేటర్ శత్రువుల ఎదురుకాల్పుల నుంచి సులభంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది.
క్షిపణిని ప్రయోగించిన అనంతరం మళ్లీ రీలోడ్ చేయాల్సి వస్తే సైనికులు లేదా మెరైన్లు తమ ప్రస్తుత స్థానాన్ని మార్చుకోవచ్చు.
ఇది యుద్ధభూమిలో సైనికుల భద్రతను పెంచడంతో పాటు చురుకైన దాడులకు అవకాశం కల్పిస్తుంది.