Oman coast: ఒమాన్ తీరంలో మృతి చెందిన భారత నావికుడు.. తీరానికి చేరిన మృతదేహం
ఈ వార్తాకథనం ఏంటి
ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ట్యాంకర్ నౌకలో అనారోగ్యంతో మరణించిన భారతీయ నావికుడు నిశాంత్ ఉయిర్థనాథన్ మృతదేహాన్ని సోమవారం తీరానికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతీయ నావికుల తరఫున పనిచేస్తున్న ఫార్వర్డ్ సీమన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్యూఐ) వెల్లడించింది. ఎంటీ సెలెస్టియల్ (MT Celestial) ట్యాంకర్ నౌక నుంచి నిశాంత్ మృతదేహాన్ని ఒమాన్లోని డుక్మ్ పోర్టులో దింపి, అనంతరం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఆసుపత్రికి తరలించినట్లు మస్కట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా ఎఫ్ఎస్యూఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పంపిన ఎస్ఓఎస్ సంకేతాలను పట్టించుకోకపోవడం, సకాలంలో వైద్య సహాయం అందకపోవడం వల్లే యువ నావికుడు ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించింది.
వివరాలు
జూన్ 11న నౌకలోనే మరణం
అలాగే మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమిళనాడులోని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. నిశాంత్ ఉయిర్థనాథన్కు జూన్ 9న తీవ్ర అస్వస్థత ఏర్పడగా, రెండు రోజుల తరువాత అంటే జూన్ 11న నౌకలోనే ఆయన మరణించినట్లు సమాచారం. పరిస్థితి విషమిస్తున్న సంకేతాలు కనిపించినప్పటికీ తక్షణ వైద్య సహాయం అందలేదని యూనియన్ ఆరోపించింది. మృతదేహాన్ని భద్రపరచేందుకు నౌకలో సరైన శీతలీకరణ సదుపాయాలు కూడా లేవని ఎఫ్ఎస్యూఐ పేర్కొంది. దీంతో మృతదేహం కుళ్లిపోకుండా నిల్వ ఉంచేందుకు సిబ్బంది చల్లటి నీటి సీసాలను ఉపయోగించాల్సి వచ్చిందని వెల్లడించింది.
వివరాలు
వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలి
"మూడు రోజులుగా అధికార యంత్రాంగం ఆలస్యం చేస్తుండటంతో నిశాంత్ మృతదేహం నౌకలోనే ఉండిపోయింది. ఆ యన మృతదేహాన్ని వెంటనే స్వదేశానికి తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని యూనియన్ డిమాండ్ చేసింది. ఇక మస్కట్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందించింది. నిశాంత్ జూన్ 11న మరణించినట్లు ధృవీకరించిన రాయబార కార్యాలయం, మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించేందుకు సంబంధిత వర్గాలతో సమన్వయం చేస్తున్నట్లు తెలిపింది. కుటుంబ సభ్యులకు సానుభూతి కూడా వ్యక్తం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో నిశాంత్ తీవ్ర అస్వస్థతతో కనిపిస్తుండగా, సహచర సిబ్బంది ఆయనకు ఆహారం అందిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వివరాలు
రెండు రోజులుగా నౌకలోనే మృతదేహం
ఈ వీడియో తర్వాత వైద్య సహాయం ఆలస్యంపై మరింత చర్చ మొదలైంది. ఎఫ్ఎస్యూఐ విడుదల చేసిన మరో వీడియోలో నిశాంత్ మృతదేహాన్ని ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచినట్లు కనిపించింది. శీతలీకరణ సదుపాయం లేకపోవడంతో మృతదేహాన్ని పరిరక్షించేందుకు సిబ్బంది ఇలా చేసినట్లు యూనియన్ తెలిపింది. "రెండు రోజులకుపైగా మృతదేహం నౌకలోనే ఉండిపోయింది. సరైన శీతలీకరణ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది చల్లటి నీటి సీసాలను ఉపయోగిస్తూ మృతదేహం కుళ్లిపోకుండా ప్రయత్నించడం బాధాకరమైన విషయం. ఇది ఆరోగ్యపరంగా కూడా ప్రమాదకరని ఎఫ్ఎస్యూఐ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఇటీవల ఒమాన్ సమీపంలో జరిగిన అమెరికా వైమానిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటన తర్వాత ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
వివరాలు
తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు
ఈ ఘటనలపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. జీ-7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యే సమయంలో ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించాలని ప్రతిపక్ష నేతలు కోరుతున్నారు. అంతేకాకుండా, మూడు నెలలకు పైగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో పౌర నౌకలపై ప్రాణాంతక దాడులు జరగడంపై భారత్ ఇప్పటికే రెండోసారి అమెరికా ప్రభుత్వానికి నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధిని పిలిపించి, పౌర నౌకలపై ప్రాణాంతక శక్తిని వినియోగించడంపై తమ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.