Bangladesh Protest: భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలి: బంగ్లాదేశ్ ఇంకిలాబ్ మోంచా
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థి నాయకుడు, ఇంకిలాబ్ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హాదీ హత్య నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతోన్న ఇంకిలాబ్ మోంచా తాజాగా భారతీయులపై విషం కక్కింది. బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలంటూ డిమాండ్ చేసింది. ఈ విషయంపై యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేసింది. హాదీ హత్యకు న్యాయం కోరుతూ, ఇంకిలాబ్ మోంచా కొన్ని కీలక డిమాండ్లు పెట్టింది. తన నేత మరణానికి సంబంధిత నిందితులు, వారికి సహకరించిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేయాలని కోరింది. అదనంగా, బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
వివరాలు
ఉస్మాన్ హాదీపై ఢాకాలో కాల్పులు
అలాగే, షేక్ హసీనాను అప్పగించేందుకు భారత్ నిరాకరిస్తే.. ఆ దేశంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని తమ ఫేస్బుక్ ఖాతా ద్వారా ప్రస్తావిస్తూ,సోమవారం భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. భారత వ్యతిరేకి 32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై డిసెంబరు 12న ఢాకాలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ హాదీని సింగపూర్కు తరలించి చికిత్స అందించగా,డిసెంబరు 18న ఆయన మరణించాడు. హాదీ మృతి వార్త వెలువడగానే బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. మీడియా ఆఫీసులు,అవామీ లీగ్ కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేశారు. ఆ సందర్భంలో హాదీని చంపిన ఇద్దరు వ్యక్తులు భారత్లోకి ప్రవేశించారని బంగ్లాదేశ్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.