LNG shortage : ఎల్ఎన్జీ ట్యాంకర్లకు అడ్డుకట్ట.. ఇరాన్ నిర్ణయంతో కలకలం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఒకవైపు ఉంటే, శాశ్వత శాంతి కోసం ఇరాన్ తన కఠిన వైఖరిని కొనసాగించడం మరోవైపు ఉద్రిక్తతలను తగ్గించే సూచనలు కనిపించడం లేదు. ఈ పరిణామాల మధ్య ప్రాంతంలో యుద్ధ భయాలు మరింతగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో,అమెరికాపై ఒత్తిడి పెంచే విధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపేలా హర్మూజ్ జలసంధిలో పరిస్థితులను సంక్లిష్టం చేస్తోంది. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఒక్క ఎల్ఎన్జీ ట్యాంకర్కూ అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తోంది.
వివరాలు
39 రోజులుగా తీవ్రంగా దెబ్బతిన్న నౌకల రాకపోకలు
తాజాగా ఖతార్ నుంచి వచ్చిన రెండు ఎల్ఎన్జీ ట్యాంకర్లకు కూడా ఇరాన్ అనుమతి నిరాకరించడంతో, అవి తిరిగి వెళ్లాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని సంబంధిత రవాణా వ్యాపార వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. దీని వల్ల గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్,అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 39 రోజులుగా హర్మూజ్ ప్రాంతంలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, ఇరాన్ అనుమతి పొందిన కొన్ని చమురు మరియు సరకు రవాణా నౌకలు మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి.
వివరాలు
ఇరాన్ నుంచి అనుమతి రాకపోవడమే ప్రధాన కారణం
ఇక గల్ఫ్ సముద్ర ప్రాంతంలో అనేక సరకు నౌకలు చెల్లాచెదురుగా నిలిచిపోయినట్లు షిప్ ట్రాకింగ్ డేటా సూచిస్తోంది. వీటికి ఇరాన్ నుంచి అనుమతి రాకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముదిరే అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి.