Strait of Hormuz : హర్మూజ్పై ఇరాన్కు భారీ ఎదురుదెబ్బ.. 80 శాతం పట్టు కోల్పోయినట్లే!
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమ ఆధిపత్యమే కొనసాగుతోందని ఇరాన్ చెబుతుండగా.. అమెరికా కూడా నియంత్రణ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మరో అడుగు ముందుకేసి.. హర్మూజ్ జలసంధి ఇక తమ భూభాగమేనంటూ వ్యాఖ్యానించారు. ఇరాన్ ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే, సముద్ర రవాణాకు సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే.. హర్మూజ్పై టెహ్రాన్ పట్టుకు క్రమంగా గండి పడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఈ జలసంధిపై ఇరాన్ దాదాపు 80 శాతం నియంత్రణను కోల్పోయిన పరిస్థితి నెలకొంది.
వివరాలు
హర్మూజ్లో మారిన నౌకల దారి.. 80 శాతం ఒమన్ రూట్కే మొగ్గు
ప్రస్తుతం హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు రెండు ప్రధాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
ఇరాన్ సూచించిన మార్గం ఒకటి కాగా.. ఒమన్ ఉత్తర తీరాన్ని ఆనుకుని వెళ్లే షిప్పింగ్ ఛానెల్ మరోటి.రెండో మార్గాన్ని అమెరికా సూచిస్తోంది.
ఐక్యరాజ్యసమితి అనుమతించిన రవాణా మార్గంగా దీనిని పేర్కొంటోంది.
హర్మూజ్ తమ ఆధీనంలోనే ఉందని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. ఒమన్ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై ఆ దేశం పలుమార్లు దాడులకు పాల్పడుతోంది.
అయినప్పటికీ.. నౌకలు పెద్ద సంఖ్యలో అదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి.
షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత రెండు వారాల్లో హర్మూజ్ జలసంధిని దాటిన నౌకల్లో 80 శాతానికి పైగా ఒమన్ మార్గాన్నే వినియోగించాయి.
వివరాలు
హర్మూజ్లో మారిన నౌకల దారి.. 80 శాతం ఒమన్ రూట్కే మొగ్గు
ఇరాన్ దాడుల ముప్పు ఉన్నప్పటికీ.. అమెరికా నౌకాదళాలు అందిస్తున్న భద్రత కారణంగా నౌకలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నట్లు కెప్లెర్ డేటా సూచిస్తోంది.
ఈ పరిణామాలను బట్టి హర్మూజ్పై ఇరాన్ నియంత్రణ బలహీనపడుతున్నట్లు అర్థమవుతోందని కెప్లెర్ క్రూడాయిల్ అనాలిసిస్ హెడ్ హోమాయూన్ అభిప్రాయపడ్డారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నెల రోజుల క్రితం వరకు ఒమన్ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపుగా కనిపించలేదు.
అయితే, గత రెండు వారాలుగా ఈ మార్గంలో ట్రాఫిక్ ఒక్కసారిగా పెరిగింది. దీంతో హర్మూజ్ జలసంధిలో నౌకల ప్రయాణ విధానం గణనీయంగా మారినట్లు స్పష్టమవుతోంది.
వివరాలు
హర్మూజ్లో నౌకల రక్షణ బాధ్యత అమెరికాదే.. ఇరాన్ దాడుల భయంతో ట్రాన్స్పాండర్లు ఆఫ్!
కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాలు హర్మూజ్ మీదుగా పర్షియన్ గల్ఫ్ను దాటేందుకు భారీ క్రూడాయిల్ ట్యాంకర్లను ఉపయోగిస్తున్నాయి.
ఈ నౌకలు గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని ప్రమాదకర ప్రాంతాన్ని దాటిన తర్వాత.. కస్టమర్ ట్యాంకర్లలో చమురును నింపుతున్నాయి.
అయితే, హర్మూజ్ గుండా ప్రయాణించే సమయంలో ఇరాన్ దాడులను తప్పించుకునేందుకు కొన్ని నౌకలు కొన్ని వారాల పాటు తమ ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న అన్ని నౌకల కదలికలను అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది.
తాము సూచించిన మార్గంలో ప్రయాణించే నౌకలకు రక్షణ కల్పిస్తున్నామని అమెరికా చెబుతోంది. చమురు రవాణాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది.
వివరాలు
హర్మూజ్లో చమురు రవాణా పెరుగుతోంది.. ట్రంప్ ప్రకటనకు ఇదే కారణమా?
అమెరికా ఇంధన మంత్రి క్రిస్ రైట్ ఇటీవల కీలక వివరాలు వెల్లడించారు.
గత వారం హర్మూజ్ జలసంధి మీదుగా రోజుకు సగటున 15 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగినట్లు తెలిపారు.
యుద్ధానికి ముందు ఉన్న రోజువారీ సగటు 20 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చమురు రవాణా మళ్లీ చేరువవుతోందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే హర్మూజ్ జలసంధి తమ భూభాగమేనంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆర్థికంగానూ ఇరాన్కు ఎదురుదెబ్బ
హర్మూజ్ విషయంలో ఇరాన్కు మరో ఆర్థికపరమైన సవాలు కూడా ఎదురవుతోంది.
అమెరికాతో చర్చిస్తున్న అవగాహన ఒప్పందం ప్రకారం..హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు చేసే అవకాశం ఇరాన్కు లభించాల్సి ఉంది.
అయితే,గల్ఫ్ దేశాలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
అమెరికా సూచిస్తున్న ఒమన్ మార్గాన్ని నౌకలు ఎంచుకోవడానికి ఈ టోల్ అంశం కూడా ఒక కారణంగా మారినట్లు భావిస్తున్నారు.
హర్మూజ్పై ఇరాన్ ఆధిపత్యం మరింత తగ్గితే.. టెహ్రాన్కు వ్యూహాత్మకంగానే కాకుండా ఆర్థికంగానూ గణనీయమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఇదే సమయంలో జలసంధిపై తన ప్రభావాన్ని కొనసాగించేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
నౌకల రాకపోకలను నిర్వహించేందుకు సంబంధించిన ప్రణాళికపై ఒమన్తో ఒప్పందం కుదిరిందని టెహ్రాన్ ఇప్పటికే ప్రకటించింది.
వివరాలు
ఆర్థికంగానూ ఇరాన్కు ఎదురుదెబ్బ
అయితే, ఈ ఒప్పందం అమలుపై ఇప్పుడు అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ వ్యవహారంలో ఒమన్ జోక్యం చేసుకుంటే ఆ దేశంపై బాంబు దాడులు చేస్తామని అమెరికా హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో ఒమన్తో కుదిరిన ఒప్పందం ముందుకు సాగుతుందా? లేదా? అన్నదానిపై సందిగ్ధత ఏర్పడింది.
మొత్తంగా.. హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు, అమెరికా భద్రత, ఇరాన్ దాడులు, టోల్ వివాదం, ఒమన్ మార్గానికి పెరుగుతున్న ఆదరణ.. ఈ కీలక జలమార్గంపై ఆధిపత్య సమీకరణాలను వేగంగా మార్చుతున్నాయి.