Masoud Pezeshkian: ప్రాణాలు అర్పించేందుకు 1.4 కోట్ల ఇరానీయులు సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. దేశం కోసం అవసరమైతే తనతో పాటు ఇరాన్ ప్రజలు కూడా ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. దేశ రక్షణ కోసం ఎప్పుడైనా తాను ప్రాణత్యాగానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. ఏ పరిస్థితుల్లోనూ పోరాటాన్ని ఆపే ఆలోచన లేదని తెలిపారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు. ఇదిలా ఉండగా, హర్మూజ్ జలసంధిని నిర్ణీత గడువులోగా తెరవకపోతే ఇరాన్లోని పలు కీలక స్థావరాలు,మౌలిక సదుపాయాలపై దాడులు జరిపే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.
వివరాలు
తాత్కాలిక ఒప్పందాలను అంగీకరించే ప్రసక్తే లేదు: ఇరాన్
ఈసారి ఎలాంటి గడువు పొడిగింపులు ఉండవని ఆయన స్పష్టంచేశారు. అవసరమైతే ఒక్కరాత్రిలోనే ఇరాన్ను పూర్తిగా నిర్వీర్యం చేయగలమని కూడా హెచ్చరించారు. ఆ చర్యలు మంగళవారం రాత్రే జరిగే అవకాశముందని సూచించారు. అయితే అమెరికా ప్రతిపాదనలు, తాత్కాలిక ఒప్పందాలను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో అన్న అనిశ్చితి పెరుగుతోంది. ఈ సమయంలో ఇరాన్ అధ్యక్షుడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమని ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మసూద్ పెజెష్కియాన్ చేసిన ట్వీట్
More than 14 million proud Iranians have so far registered to sacrifice their lives to defend Iran. I too have been, am, and will remain devoted to giving my life for Iran. https://t.co/B9GBHAAEMu
— Masoud Pezeshkian (@drpezeshkian) April 7, 2026