LOADING...
Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన
'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన

Iran: 'అమెరికా మా డిమాండ్లు ఒప్పుకుంటేనే యుద్ధ విరమణ': ఇరాన్ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇంధన వనరులపై చేపట్టాల్సిన సైనిక దాడులను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే.. ఇరాన్ నుంచి మరో కీలక హెచ్చరిక వెలువడింది. తమపై అమల్లో ఉన్న అన్ని ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో పాటు, యుద్ధం కారణంగా కలిగిన నష్టానికి పరిహారం చెల్లించినప్పుడే శాంతి చర్చలు సాధ్యమవుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. అంతేకాదు, తమ ప్రతిపాదించిన అన్ని షరతులను అమెరికా అంగీకరిస్తేనే యుద్ధ విరమణ జరుగుతుందని ఖరాఖండిగా తెలిపింది.

వివరాలు 

అంతర్జాతీయ హామీ

ఇటీవల రెండు రోజులుగా ఇరాన్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు సాగుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. ఈ పరిస్థితుల్లోనే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు,ఇంధన మౌలిక వసతులపై జరగాల్సిన దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని అమెరికా రక్షణ శాఖకు ఆదేశించినట్లు ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికగా పేర్కొన్నారు. అయితే ఈ ప్రకటనపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ.. కేవలం దాడులను వాయిదా వేయడం సరిపోదని స్పష్టం చేశారు. అమెరికా విధించిన అన్ని ఆంక్షలను తొలగించడంతో పాటు, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, అలాగే తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని అంతర్జాతీయ హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ షరతులు నెరవేరే వరకు పోరు కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

వివరాలు 

ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలపై సందిగ్ధత

ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశమున్నట్లు వస్తున్న వార్తలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ విషయంపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. ఈ సమావేశంపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సమాచారాన్ని ఖరారు అయినట్టుగా భావించవద్దని ఆమె సూచించారు. ఇదే సమయంలో ఈ చర్చలు అత్యంత సున్నితమైనవని, వీటిని ముందుగానే మీడియాలో ప్రస్తావించడం సముచితం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

వివరాలు 

ప్రభావితమైన అంతర్జాతీయ నౌకాయానం 

ఫిబ్రవరి 28న ఇరాన్ అగ్రనేత ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘర్షణ మొదలైంది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ నగరాలపై దాడులకు దిగింది. అంతేకాకుండా, హార్మూజ్ జలసంధిని మూసివేసి అంతర్జాతీయ నౌకాయానాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో 48 గంటల్లోగా హార్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిణామాల మధ్య ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ద్వీపంపై అమెరికా దాడి చేయబోతుందన్న వార్తలు వినిపించాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ట్రంప్ ఈ దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయడం గమనార్హం.

Advertisement