Iran-US: ఇరాన్-అమెరికా మధ్య మరింత ముదిరిన యుద్ధం.. యూఎస్ వార్షిప్లపై క్షిపణి దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణను మరింత తీవ్రతరం చేస్తూ.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) దళాలు అమెరికాకు చెందిన విమాన వాహక నౌక, డెస్ట్రాయర్పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ చమురు ట్యాంకర్లను అడ్డుకుంటున్న నేపథ్యంలో వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అనంతరం అవి హర్మూజ్ జలసంధిని విడిచి వెళ్లిపోయాయని ఇరాన్ తెలిపింది. శనివారం హర్మూజ్లోని ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఐఆర్జీసీ ఈ దాడులకు పాల్పడినట్లు పేర్కొంది.
వివరాలు
గతంలో కంటే ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నాం
హర్మూజ్ జలసంధిలో అనధికారిక మార్గాల్లో ప్రయాణిస్తున్న మూడు ట్యాంకర్లతో పాటు అమెరికాకు అనుబంధంగా ఉన్న మరో మూడు నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ తెలిపింది.
ఇరాన్ నౌకల విషయంలో అమెరికా దూకుడుగా వ్యవహరిస్తూ.. దాడులు కొనసాగిస్తే మా నుంచి గట్టి ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఆ దేశ సైనిక నౌకలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తాం. గతంలో కంటే ఇప్పుడు మేము మరింత బలంగా ఉన్నామని ఐఆర్జీసీ హెచ్చరించింది.
వివరాలు
మా నౌకలు తప్పించుకున్నాయ్..
మరోవైపు ఇరాన్ దాడుల నుంచి తమ యుద్ధ నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని అమెరికా ప్రకటించింది.
ఈ దాడుల్లో తమ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.
తమ నౌకాదళాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తే.. ఆ దేశ నౌకలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరించింది.
దీంతో హర్మూజ్ జలసంధిలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.