LOADING...
Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన
వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన

Iran-US, Israel Conflict: వారికి అలర్ట్.. ఇరాన్‌ను తక్షణమే విడిచి వెళ్లాలని కేంద్రం సూచన

వ్రాసిన వారు Moogati Shabari
Apr 08, 2026
12:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో ఉన్న భారతీయులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరాలని, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా సూచనలు విడుదల చేసింది. అవసరమైన సహాయం కోసం ఎంబసీని సంప్రదించాలని భారత పౌరులకు తెలిపింది. అలాగే, తాము సూచించిన మార్గాలను అనుసరించి దేశాన్ని వీడాలని స్పష్టంగా పేర్కొంది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈ తాజా సూచనలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

వివరాలు

గడువు పొడిగించిన అమెరికా

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అనూహ్య మలుపు తీశాయి. ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకునే సంకేతాలు ఇస్తూ "ఇవాళే కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని హెచ్చరించిన డొనాల్డ్ ట్రంప్, అకస్మాత్తుగా రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఈ పరిణామంలో కీలక పాత్ర పోషించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన విజ్ఞప్తి మేరకు, ఇరాన్‌కు మరింత సమయం ఇవ్వాలని కోరడంతో, ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మళ్లీ తెరవాలని అమెరికా ప్రధాన డిమాండ్‌గా ఉంచింది. దీనిపై చర్చల తర్వాత ఇరాన్‌కు గడువు పొడిగించారు.

వివరాలు

భారత పౌరులకు అలెర్ట్..

అదే సమయంలో, తమ డిమాండ్లను అమెరికా పాక్షికంగా అంగీకరించిందని పేర్కొంటూ, రెండు వారాల కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో రాకపోకలు ఇరాన్ సాయుధ దళాల పర్యవేక్షణలోనే కొనసాగుతాయని కూడా స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో, ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ముఖ్య ప్రకటన చేసింది. అక్కడ ఉన్న భారత పౌరులు వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని సూచించింది.

Advertisement

వివరాలు

హెచ్చరికలు జారీ..

యుద్ధ ప్రభావంతో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో, ఇరాన్‌లో ఉన్న భారతీయులు తక్షణం అక్కడి నుంచి బయటపడాలని భారత ప్రభుత్వం బుధవారం అధికారికంగా సలహా జారీ చేసింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం 'ఎక్స్' (X) వేదికగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అందులో, రాయబార కార్యాలయం సూచించిన మార్గాల ద్వారానే దేశం విడిచి వెళ్లాలని స్పష్టంగా పేర్కొంది. అలాగే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా లేదా రాయబార కార్యాలయంతో సమన్వయం లేకుండా ఏ అంతర్జాతీయ భూ సరిహద్దు వద్దకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ సూచనలు విడుదలయ్యాయి.

Advertisement

వివరాలు

స్వదేశానికి 1800 మంది..

ఇక, మంగళవారం సాయంత్రం మరో ప్రకటనలో, రాబోయే 48 గంటల పాటు ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని రాయబార కార్యాలయం సూచించింది. ఇళ్లలోనే ఉండాలని, సైనిక స్థావరాలు, విద్యుత్ కేంద్రాలు, అలాగే ఎత్తైన భవనాల పై అంతస్తుల వంటి ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. అధికారిక సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన తర్వాత, అక్కడ సుమారు 9,000 మంది భారతీయులు, అందులో విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు 1,800 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement