LOADING...
Iran war: పశ్చిమ ఆసియాలో నౌకలపై దాడులు: ముగ్గురు భారతీయులు మృతి
పశ్చిమ ఆసియాలో నౌకలపై దాడులు: ముగ్గురు భారతీయులు మృతి

Iran war: పశ్చిమ ఆసియాలో నౌకలపై దాడులు: ముగ్గురు భారతీయులు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఇప్పటివరకు భారతదేశానికి చెందిన ముగ్గురు నావికులు ప్రాణాలు కోల్పోయినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల వద్ద ఉన్న కొన్ని వాణిజ్య నౌకలపై ఇరాన్ నిర్వహించిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా షిప్ ఆపరేటర్లకు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.

వివరాలు 

భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలి 

గల్ఫ్ ఆఫ్ ఒమన్, హోర్ముజ్ జలసంధి, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. ఆయా సముద్ర మార్గాల్లో క్షిపణులు, డ్రోన్ కార్యకలాపాల వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించినట్లు వివరించింది. నౌకల నిర్వహణలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా చర్యలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించింది. తాజా నివేదికల ప్రకారం భారత జెండా కలిగిన నౌకలను ఎక్కడ కూడా బంధించినట్లు సమాచారం అందలేదని షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ శ్యామ్ జగన్నాథన్ తెలిపారు. ఇప్పటివరకు రక్షించబడిన సిబ్బందిని స్వదేశానికి తరలించేందుకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు.

వివరాలు 

యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారత నావికులతో నిరంతరం సంప్రదింపులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ సమీప ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయ నావికులకు తక్షణ సహాయం అందించేందుకు, అవసరమైతే వారిని భారత్‌కు తీసుకురావడానికి ప్రత్యేక ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారత నావికులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తుందని చెప్పారు. నావికుల కుటుంబ సభ్యులు, షిప్పింగ్ సంస్థలు, ట్రేడ్ యూనియన్లు, విదేశాల్లోని భారత మిషన్లు, సంబంధిత పోర్టు అధికారులు తదితరులతో ఈ బృందం సమన్వయం సాధిస్తూ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు.

Advertisement