Trump: మిడ్టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్లో జరగనున్న మిడ్టర్మ్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇరాన్తో యుద్ధం ముగిసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్.. ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ఆగిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్ ఎక్కువ కాలం ఈ యుద్ధాన్ని కొనసాగించే పరిస్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా మిడ్టర్మ్ ఎన్నికలపై ప్రభావం చూపేందుకు టెహ్రాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ ఆరోపించారు.
వివరాలు
దీర్ఘకాలిక యుద్ధంతో రాజకీయంగా నష్టం
ఇరాన్తో యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అమెరికా రాజకీయాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే ప్రమాదం ఉందని ట్రంప్కు ఆయన సన్నిహిత సలహాదారులు సూచించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామం తన అధ్యక్ష పదవీకాలంపై కూడా గణనీయమైన ప్రభావం చూపవచ్చని వారు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా ఇరాన్తో చర్చలు జరిపేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే, చర్చల ప్రతిపాదనలపై ఇరాన్ నాయకత్వం ఇప్పటివరకు సానుకూలంగా స్పందించడం లేదు.
వివరాలు
హర్ముజ్పై ఆధిపత్యానికి అమెరికా ప్రయత్నాలు
ఇరాన్పై ఒత్తిడి పెంచడంతో పాటు వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంపై నియంత్రణ సాధించడం ద్వారా ఇరాన్పై మరింత పట్టును సాధించాలనే లక్ష్యంతో అమెరికా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ఐదు ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు
ఇదిలా ఉండగా.. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కు చెందిన నాలుగు చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది.
అలాగే ఖార్గ్ ఐలాండ్లో ఉన్న మరో ఆయిల్ ట్యాంక్ను కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది.
దీంతో మొత్తం ఐదు ఇరాన్ చమురు నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం.
అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై క్షిపణి దాడులు చేసింది.
సుమారు 18 నుంచి 20 మిసైళ్లను ఇరాన్ ప్రయోగించినట్లు సమాచారం.
అయితే, అమెరికా ఎయిర్బేస్లో ఏర్పాటు చేసిన రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చివేశాయి.