JD Vance: జేడీ వాన్స్ వ్యాఖ్యలు హిందూ వ్యతిరేకతకు ఆజ్యం పోశాయి: అమెరికా చట్టసభ సభ్యుడి విమర్శలు!
ఈ వార్తాకథనం ఏంటి
తన భార్య ఉషా వాన్స్ మత మార్పు అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) చేసిన వ్యాఖ్యలు తాజాగా పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి (Raja Krishnamoorthi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన్స్ వ్యాఖ్యలు అమెరికాలో హిందూ వ్యతిరేకతను మరింత ప్రోత్సహిస్తున్నాయంటూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై కృష్ణమూర్తి తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేశారు. అమెరికాలో భారతీయ-అమెరికన్లపై పెరుగుతున్న పక్షపాతం, సామూహిక బహిష్కరణలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక భావాలు ఇప్పటికే పెరుగుతున్న తరుణంలో, అదే పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు వాన్స్ చేసిన వ్యాఖ్యలు నిరాశ కలిగించాయని తెలిపారు.
Details
భవిష్యత్తులో క్రైస్తవ మతంలోకి మారే అవకాశం
వాన్స్ వ్యాఖ్యలు ఆ వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. ఇటీవల జేడీ వాన్స్ ఓ యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉషా మతం విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఉషా క్రైస్తవ మతంలోకి మారుతారని తాను ఆశిస్తున్నట్లు వాన్స్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పెరుగుతున్న వ్యతిరేకత మధ్య ఉపాధ్యక్షుడు స్పందిస్తూ, ఉషా క్రిస్టియన్ కాదని, ఆమె మతం మార్చుకునే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఇదే సమయంలో ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ కూడా వార్తల్లో నిలిచారు.
Details
పూర్తి పారదర్శకతతో విచారణ జరగాలి
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరియు తన భర్త చార్లీ కిర్క్ మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని ఆమె ఇటీవల పేర్కొన్న విషయం గుర్తుంచుకోదగ్గది. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. తాజాగా ఎరికా కిర్క్ మాట్లాడుతూ, తన ప్రతి కదలికను కెమెరాలు గమనిస్తున్నాయని తెలిపారు. చార్లీ కిర్క్ మరణానంతరం తొలిసారిగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తన భర్త హత్య కేసుపై పూర్తి పారదర్శకతతో విచారణ జరగాలని కూడా ఆమె డిమాండ్ చేశారు.