Pak-Afghan: ఈరోజు మరోసారి చర్చలు విఫలమైతే.. యుద్ధానికే సిద్ధం: పాక్ రక్షణమంత్రి ఖవాజా
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మరో విడత శాంతి చర్చలు గురువారం జరగనున్నాయి. చివరి దశ సమావేశాలు టర్కీలోని ఇస్తాంబుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదివరకూ అనేక సార్లు రెండు దేశాలు చర్చలకు కూర్చున్నప్పటికీ, ఆశించిన పురోగతి ఏదీ సాధించలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మాట్లాడేందుకు ఇరు పక్షాలు ముందుకు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. అయితే ఈ సందర్బంగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈసారి కూడా చర్చలు విఫలమైతే పరిస్థితి నేరుగా యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. తమకు పరిస్థితిని ఎదుర్కొనే అనేక మార్గాలు ఉన్నాయని అన్నారు.
వివరాలు
తాలిబాన్ను ఎదుర్కోవడంలో చివరి దశ పరిష్కారం యుద్ధం తప్ప మరేదీ కాదు
చర్చలు మొదలయ్యే ముందు నుంచే ఖవాజా ఆసిఫ్ జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఫ్ఘానిస్థాన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాబూల్ ఉగ్రవాదులకు సంరక్షణ కల్పిస్తోందని, సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. పాకిస్థాన్ పౌరులపై డ్రోన్ యుద్ధానికి దిగుతోందని పేర్కొన్నారు తాలిబాన్ను ఎదుర్కోవడంలో చివరి దశ పరిష్కారం యుద్ధం తప్ప మరేదీ కాదు అని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను ఆఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం ఘాటుగా ఖండించింది. ఇటీవల ఖతార్లోని దోహాలో కూడా ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
వివరాలు
తమ జోలికి వస్తే 50రెట్ల ప్రతిదాడులు
కానీ ఆ చర్చలు కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. అక్కడ జరిగిన సమావేశాల్లో కూడా ఇరు దేశాలు ఒకరిపై ఒకరు కఠిన వ్యాఖ్యలు చేసుకున్నట్లు సమాచారం. దీని వల్ల చర్చలు ఏకాభిప్రాయం దిశగా సాగకుండా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.అదే సమయంలో ఖవాజా ఆసిఫ్ మరోసారి కఠిన వ్యాఖ్యలు చేసి ఆఫ్ఘానిస్థాన్ను విమర్శించారు. ఢిల్లీ మద్దతు ఉన్నందునే కాబూల్ అధైర్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. తమ జోలికి వస్తే 50రెట్ల ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించారు ఇప్పుడు మళ్లీ చర్చలు ప్రారంభం కావడానికి ముందు ఆయన చేసిన "విఫలమైతే యుద్ధమే" వ్యాఖ్యలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నేటి చర్చలు ఏ దిశగా సాగుతాయి?పరిస్థితి శాంతి వైపు పోతుందా?లేక ఉద్రిక్తత మరింత పెరుగుతుందా?అన్నది ప్రస్తుతం అందరూ గమనిస్తున్న అంశం.