India-Maldives: భారతదేశ సహాయంతో నిర్మించిన మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభం.. పాల్గొన్న రామ్మోహన్ నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ అందించిన రుణ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తయ్యింది. ఈ విమానాశ్రయాన్ని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu), భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలిసి ప్రారంభించారు. ప్రపంచంతో మాల్దీవులను మరింతగా అనుసంధానించే మార్గంగా, దేశ అభివృద్ధి, శ్రేయస్సుకు గేట్వేగా ఈ విమానాశ్రయం పనిచేస్తుందని ముయిజ్జు ఈ సందర్భంగా తెలిపారు. ఇది కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఆర్థిక మార్పుకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. దేశ ఆర్థిక రంగం బలోపేతం కావడంలో, సామాజిక అభివృద్ధిలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. భారత ప్రభుత్వం లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో అందించిన ఆర్థిక సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తయింది.
వివరాలు
భారత్కు మాల్దీవులు నమ్మకమైన భాగస్వామి: మోదీ
ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరఫున మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. భారత్-మాల్దీవుల ద్వైపాక్షిక సంబంధాలు 60 ఏళ్లను దాటుతుండగా,ఈ విమానాశ్రయ ప్రారంభం ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతున్న సంకేతమని ముయిజ్జు అన్నారు. ఈ నేపథ్యంలో మాల్దీవులలోని భారత హైకమిషన్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. "పురోగతి,అభివృద్ధికి గుర్తు.'పొరుగు ముందుగా'సూత్రం,మహాసాగర్ విజన్కు భారత్ కట్టుబాటుకు మరో నిదర్శనం"అని పేర్కొంది. భారత్కు మాల్దీవులు నమ్మకమైన భాగస్వామి దేశమని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో స్పష్టం చేశారు. 'పొరుగుదేశాలకు ముఖ్య ప్రాధాన్యం'విధానంలో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందని, లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా ఆర్థిక సహకారం కొనసాగుతుందని తెలిపారు. భారత్-మాల్దీవుల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి.