Loading...
Salman Rushdie: రష్దీ హత్యాయత్నం కేసులో హాదీ మతార్ దోషి: అమెరికా కోర్టు తీర్పు
రష్దీ హత్యాయత్నం కేసులో హాదీ మతార్ దోషి: అమెరికా కోర్టు తీర్పు

Salman Rushdie: రష్దీ హత్యాయత్నం కేసులో హాదీ మతార్ దోషి: అమెరికా కోర్టు తీర్పు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై 2022లో జరిగిన కత్తిదాడి కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ ఘటనకు పాల్పడిన అమెరికా పౌరుడు హాదీ మతార్ (28)ను ఉగ్రవాదానికి సంబంధించిన అభియోగాల్లో దోషిగా తేల్చింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాకు మద్దతు అందించడం, అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడం వంటి ఆరోపణలు రుజువైనట్లు బఫెలో ఫెడరల్ జ్యూరీ బుధవారం వెల్లడించింది. ఈ కేసులో నవంబర్ 3న శిక్షను ఖరారు చేయనుండగా, అతడికి గరిష్ఠంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వివరాలు 

హాదీ మతార్ ఏడాదికిపైగా ఫత్వాపై అధ్యయనం

ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం, 1988లో సల్మాన్ రష్దీ రచించిన ది సెటానిక్ వర్సెస్ నవలపై జారీైన ఫత్వాను అమలు చేయాలనే ఉద్దేశంతోనే హాదీ మతార్ ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.

అమెరికాలోనే జన్మించి పెరిగినప్పటికీ, ఇరాన్ నాయకుల ఉగ్రవాద భావజాలం ప్రభావానికి లోనై, ఈ దాడికి సంబంధించిన ప్రణాళికను అతడు నెలల తరబడి సిద్ధం చేసినట్లు అమెరికా అటార్నీ మైఖేల్ డిగియాకోమో వెల్లడించారు.

దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ, రష్దీ ప్రాణాలతో బయటపడటం అదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

దర్యాప్తులో భాగంగా, దాడికి ముందు హాదీ మతార్ ఏడాదికిపైగా ఫత్వాపై అధ్యయనం చేసినట్లు అధికారులు గుర్తించారు.

వివరాలు 

'హసన్ ముగ్నియే' పేరుతో నకిలీ గుర్తింపు

అలాగే హిజ్బుల్లా నేతలతో సంబంధం ఉన్నట్లు భావించే 'హసన్ ముగ్నియే' పేరుతో నకిలీ గుర్తింపును ఉపయోగించి ప్రయాణించినట్లు ఆధారాలు సేకరించారు.

ఇదే పేరుతో నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తయారు చేసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటన కేవలం వ్యక్తిగత ప్రేరణతో జరిగిన దాడి కాదని, పూర్తిగా ఉగ్రవాద లక్ష్యంతో అమలు చేసిన చర్యేనని ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది.

ఎఫ్‌బీఐతో పాటు న్యూయార్క్ స్టేట్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తు అనంతరం వచ్చిన తాజా తీర్పుతో ఈ కేసు విచారణలో కీలక ఘట్టం ముగిసినట్లైంది.

ADVERTISEMENT