Riddhi Chauhan: 17 ఏళ్లకే నేవీ క్యాడెట్ల బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్గా భారత సంతతి అమ్మాయి
ఈ వార్తాకథనం ఏంటి
చాలామంది టీనేజర్లు ఉదయం స్కూల్కు వెళ్లేందుకు సిద్ధమవుతుంటే, 17 ఏళ్ల రిద్ధి చౌహాన్ మాత్రం ఇప్పటికే డ్రిల్ మైదానంలో దాదాపు 300 మంది క్యాడెట్లకు శిక్షణ ఇస్తూ నాయకత్వం వహిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం, క్వీన్స్లో ఉన్న బెంజమిన్ ఎన్. కార్డోజో హైస్కూల్లో చదువుతున్న భారతీయ మూలాలున్న ఈ విద్యార్థిని, తన పాఠశాలలోని నేవీ జూనియర్ రిజర్వ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్ (NJROTC) యూనిట్లో అత్యున్నత విద్యార్థి హోదా అయిన బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తోంది. ANI కథనం ప్రకారం, రిద్ధి అమెరికా నేవీలో కమిషన్డ్ ఆఫీసర్గా చేరాలన్న తన కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఆమెకు నేవల్ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్లో ప్రవేశం లభించింది.
వివరాలు
తొమ్మిదో తరగతిలో NJROTC కార్యక్రమంలో చేరిన రిద్ది
తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవడం కోసం రిద్ధి NJROTC కార్యక్రమంలో చేరింది.
అనంతరం అకడమిక్ కమాండర్, STEM కమాండర్, ప్లాటూన్ లీడర్, ఇన్స్పెక్షన్ కమాండర్ వంటి పలు బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తూ క్రమంగా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ స్థాయికి ఎదిగింది.
ప్రస్తుతం బెటాలియన్ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ, జూనియర్ క్యాడెట్లకు మార్గనిర్దేశం చేయడం వంటి కీలక బాధ్యతలను ఆమె నిర్వహిస్తోంది.
వారంలో నాలుగు రోజులు ఉదయం 7 గంటలకు ముందే పాఠశాలకు చేరుకుని, తరగతులు ప్రారంభమయ్యేలోపు డ్రిల్ ప్రాక్టీస్ నిర్వహించడం ఆమె దినచర్యలో భాగంగా మారింది.
వివరాలు
తొలి సీ పర్చ్ అండర్వాటర్ రోబోట్ రూపకల్పనకు నాయకత్వం
నాయకత్వంతో పాటు విద్యా రంగంలోనూ రిద్ధి ప్రతిభ చాటుకుంది.
అకడమిక్ కమాండర్గా పనిచేసిన సమయంలో తన పాఠశాల బృందాన్ని వరుసగా రెండేళ్లు లీడర్షిప్ అండ్ అకడమిక్ బౌల్ రెండో దశకు అర్హత సాధించేలా చేసింది.
అంతేకాదు,జాతీయ స్థాయి అకడమిక్ పరీక్షలో తమ యూనిట్ తొలి స్థానంలో నిలవడంలో కూడా కీలక పాత్ర పోషించింది.
అంతేకాకుండా, బెటాలియన్ తరఫున తొలి సీ పర్చ్ అండర్వాటర్ రోబోట్ రూపకల్పనకు నాయకత్వం వహించింది.
దీని ద్వారా క్యాడెట్లకు రోబోటిక్స్, ఇంజినీరింగ్ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం లభించింది.
తన దృష్టిలో నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదని, ఇతరులకు సేవ చేయడం, ఆదర్శంగా నిలవడమేనని రిద్ధి చెబుతోంది.
వివరాలు
17 ఏళ్ల వయసులోనే వందలాది మంది క్యాడెట్లకు నాయకత్వం
వినయం, కరుణ, నిస్వార్థ సేవ వంటి విలువలను మహంత్ స్వామి మహారాజ్ బోధనలు, అలాగే BAPS స్వామినారాయణ సంస్థతో తన అనుబంధం ద్వారా నేర్చుకున్నానని ఆమె వెల్లడించింది. ఇవే తన నాయకత్వ శైలిని తీర్చిదిద్దాయని తెలిపింది.
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన రుచికా, దిలీప్ చౌహాన్ దంపతుల కుమార్తె అయిన రిద్ధి, ప్రిపరేటరీ కోర్సు పూర్తయ్యాక యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీలో చేరి అమెరికా నావికాదళంలో అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేవలం 17 ఏళ్ల వయసులోనే వందలాది మంది క్యాడెట్లకు నాయకత్వం వహిస్తూ, ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్న రిద్ధి చౌహాన్ ప్రయాణం.. పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడి పనిచేస్తే యువత ఎంతటి లక్ష్యాన్నైనా సాధించగలరని మరోసారి నిరూపిస్తోంది.