Nepal Floods: నేపాల్కు ప్రపంచ దేశాల సాయం.. రెస్క్యూ బృందాలను తిరస్కరించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్కు(Nepal Flash Floods) ప్రపంచ దేశాలు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం విదేశాల నుంచి ఎలాంటి సెర్చ్, రెస్క్యూ బృందాల సాయం అవసరం లేదని నేపాల్ స్పష్టం చేసింది. సహాయక చర్యలను స్వయంగా చేపట్టే సామర్థ్యం తమ భద్రతా బలగాలకు ఉందని వెల్లడించింది. బుధవారం సంభవించిన భారీ వరదలు, బురద ప్రవాహాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బోటెకోసి, త్రిశూలీ నదుల పరివాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాలు
మృతుల సంఖ్య 469
రెస్క్యూ ఆపరేషన్ కోసం పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సహాయం అందించేందుకు ముందుకొచ్చాయని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే ఆయా దేశాలు, సంస్థల నుంచి వచ్చిన సహాయ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు పేర్కొంది.
నేపాలీ భద్రతా దళాల ఆధ్వర్యంలోనే సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన అభ్యర్థనలను కూడా నేపాల్ అంగీకరించలేదు.
అయితే విదేశీ రెస్క్యూ బృందాల కంటే ఆర్థిక సాయం తమకు అవసరమని నేపాల్ పేర్కొంది.
వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం చేపట్టే సమయంలో అంతర్జాతీయ సహాయాన్ని స్వీకరించనున్నట్లు తెలిపింది.
ఇదిలా ఉండగా.. నేపాల్లో వరదలు, బురద ప్రవాహాల కారణంగా మృతుల సంఖ్య 469కి చేరింది.
వివరాలు
నేపాల్కు శ్రీలంక ఆర్థిక సాయం
మరోవైపు టిబెట్లో మరోసారి వరదలు సంభవించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో చైనా అక్కడ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ను నిలిపివేసింది.
నేపాల్కు ఆర్థిక సాయం అందించేందుకు శ్రీలంక కూడా ముందుకొచ్చింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణకు 10 లక్షల డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు శ్రీలంక ప్రకటించింది.