Netanyahu: కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ త్వరలో ప్రారంభం: నెతన్యాహు
ఈ వార్తాకథనం ఏంటి
కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ త్వరలో అమల్లోకి రానుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. హమాస్ ఇంకా ఒక బందీ మృతదేహాన్ని అప్పగించాల్సి ఉందని, అది పూర్తయిన తర్వాతే రెండో దశ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ దశలో భాగంగా హమాస్ను నిరాయుధీకరించడం, గాజాను సైనిక రహిత ప్రాంతంగా మార్చడం, అక్కడ అంతర్జాతీయ దళాలను మోహరించడం, పాలస్తీనా పరిపాలన కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో అంతర్జాతీయ బోర్డు ఏర్పాటు చేయడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.
వివరాలు
గాజా నుంచి తీవ్రవాదాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంది: నెతన్యాహు
ఆదివారం ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిచ్ మెర్జ్తో నెతన్యాహు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒప్పందంలోని తొలి దశ పూర్తయ్యాక రెండో దశ అమలు అసాధ్యమని అనేక మంది అంటున్నారన్నారు. అలాగే ఒప్పందంలో మూడో దశ కూడా ఉందని, ఆ దశలో గాజా నుంచి తీవ్రవాదాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ఇది కూడా సాధ్యం కాదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అయితే జర్మనీలో, జపాన్లో, గల్ఫ్ దేశాల్లో ఇలాగే జరిగిందని గుర్తు చేస్తూ, గాజాలో కూడా అది సాధ్యమేనని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం హమాస్ను పూర్తిగా నాశనం చేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.