LOADING...
Benjamin Netanyahu:  క్యాన్సర్ చికిత్స తర్వాత.. మళ్లీ ఆస్పత్రిలో నెతన్యాహు.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఏమైంది?
ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఏమైంది?

Benjamin Netanyahu:  క్యాన్సర్ చికిత్స తర్వాత.. మళ్లీ ఆస్పత్రిలో నెతన్యాహు.. ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఏమైంది?

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి ఆస్పత్రిలో చేరడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం (మే 25) సాయంత్రం జెరూసలేం నగరంలోని హదస్సా ఐన్ కెరెమ్ మెడికల్ సెంటర్‌కు నెతన్యాహును తరలించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆయనకు దంత సంబంధిత చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రోస్టేట్ క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్స పూర్తయిందని ప్రకటించిన నెతన్యాహు మళ్లీ ఆస్పత్రిలో చేరడంతో అయన ఆరోగ్యంపై సందేహాలు మరింత పెరిగాయి.

వివరాలు 

ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స వివరాలు

గత నెలలో సోషల్ మీడియా ద్వారా నెతన్యాహు తాను ప్రోస్టేట్‌లో ఉన్న మాలిగ్నెంట్ ట్యూమర్‌కు రేడియేషన్ థెరపీ చేయించుకున్నట్లు వెల్లడించారు. ఈ చికిత్స విజయవంతంగా పూర్తైందని ఆయన తెలిపారు. అయితే ఇరాన్‌తో జరిగిన ఉద్రిక్త పరిస్థితుల సమయంలో ఈ సమాచారం బయటపెడితే ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని భావించి అప్పటివరకు గోప్యంగా ఉంచినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ యుద్ధ సమయంలో నెతన్యాహు మరణించారనే, దేశం విడిచి పారిపోయారనే పుకార్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తర్వాత స్పష్టమైంది.

వివరాలు 

నెతన్యాహు ఆరోగ్యంపై పెరుగుతున్న అనుమానాలు

76 ఏళ్ల నెతన్యాహు ఆరోగ్యంపై గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య సమాచారం ప్రజలకు పూర్తిగా వెల్లడించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ట్యూమర్ ఎప్పుడు గుర్తించారు? చికిత్స ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ముగిసింది? వంటి కీలక వివరాలను ఆయన వెల్లడించలేదు. విడుదల చేసిన ఆరోగ్య నివేదికలో కూడా స్పష్టత లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్పత్రి అధికారిక గుర్తింపు లేకపోవడం, కేవలం కొన్ని సాధారణ పాయింట్లతో నివేదిక ఇవ్వడం అనుమానాలకు తావిచ్చింది.

Advertisement

వివరాలు 

గతంలో కూడా పలు వైద్య చికిత్సలు

ఇటీవలి సంవత్సరాల్లో నెతన్యాహు పలు వైద్య చికిత్సలు చేయించుకున్నారు. 2023 జూలైలో ఆయనకు పేస్‌మేకర్ అమర్చగా, 2024 మార్చిలో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. అదే ఏడాది డిసెంబర్‌లో ప్రోస్టేట్ తొలగింపు శస్త్రచికిత్స కూడా జరిగినట్లు సమాచారం. పేస్‌మేకర్ ఘటన సమయంలో మొదట డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారులు చెప్పినా, తర్వాత హార్ట్ మానిటర్ అమర్చిన విషయం బయటపడటంతో పారదర్శకతపై ప్రశ్నలు వచ్చాయి. ECG పరీక్షలో కొన్ని అసాధారణ మార్పులు కనిపించినప్పటికీ, ఆయన గుండె పరిస్థితి పూర్తిగా సాధారణంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Advertisement