North Korea : ఉత్తర కొరియాలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రం.. IAEA కీలక నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా తన ప్రధాన యోంగ్బ్యాన్ అణు కేంద్రంలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రాన్ని నిర్మించినట్లు ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) వెల్లడించింది. ఈ కేంద్రంలో గరిష్ఠంగా 28 సెంట్రిఫ్యూజ్ వరుసలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని కాంగ్సన్ అణు కేంద్రంలో విస్తరించిన మరో విభాగం కూడా కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియా పలు ప్రాంతాల్లో అణు మౌలిక వసతులను క్రమంగా విస్తరిస్తున్నట్లు తమ పరిశీలనల్లో వెల్లడైందని IAEA తెలిపింది. ఆగస్టు 28న రూపొందించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
ఉపగ్రహ చిత్రాలు, కిమ్ పర్యటన ఫొటోలతో IAEA నిర్ధారణ
ఉపగ్రహ చిత్రాలతో పాటు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫొటోలు, ఇతర బహిరంగంగా లభించే సమాచారాన్ని విశ్లేషించి ఈ అంచనాకు వచ్చినట్లు పేర్కొంది.
2009 తర్వాత ఉత్తర కొరియాలో IAEA తనిఖీ బృందాలు పర్యటించలేదు.
యోంగ్బ్యాన్లో నిర్మించిన రెండు అంతస్తుల కొత్త భవనాన్ని అక్కడి రెండో యురేనియం శుద్ధి కేంద్రంగా IAEA గుర్తించింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ జూన్లో ఈ కేంద్రాన్ని సందర్శించిన సమయంలో ప్రభుత్వ మీడియా విడుదల చేసిన ఫొటోలను, ఆ భవనం నిర్మాణ దశలో తీసిన ఉపగ్రహ చిత్రాలతో పోల్చి ఈ విషయాన్ని నిర్ధారించినట్లు తెలిపింది.
వివరాలు
అణు కార్యక్రమంపై IAEA తీవ్ర ఆందోళన
కిమ్ జోంగ్ ఉన్ పర్యటనకు సంబంధించిన ఫొటోల్లో ప్రధాన భవనంలోని పై అంతస్తు, కింది అంతస్తుల్లోనూ గ్యాస్ సెంట్రిఫ్యూజ్ల వరుసలు ఏర్పాటు చేసినట్లు కనిపించిందని IAEA నివేదిక పేర్కొంది.
ఫొటోల్లో కనిపించిన నమూనా ఆధారంగా ఈ భవనంలో గరిష్ఠంగా 28 సెంట్రిఫ్యూజ్ వరుసలను ఏర్పాటు చేసే సామర్థ్యం ఉండొచ్చని అంచనా వేసింది.
ఇక ప్యాంగ్యాంగ్ సమీపంలోని కాంగ్సన్లో ఉన్న యురేనియం శుద్ధి కేంద్రంలోనూ కార్యకలాపాలు ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయని IAEA తెలిపింది.
2024లో నిర్మించిన అదనపు విభాగంలో ఈ ఏడాది జనవరిలో కార్యకలాపాలు మొదలైనట్లు తమ పరిశీలనల్లో గుర్తించినట్లు వెల్లడించింది.
ఉత్తర కొరియా అణు కార్యక్రమంలో జరుగుతున్న ఈ పరిణామాలు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్నాయని IAEA పేర్కొంది.
వివరాలు
IAEA అధికారాన్ని తిరస్కరించిన ఉత్తర కొరియా
యోంగ్బ్యాన్, కాంగ్సన్ కేంద్రాల్లో యురేనియం శుద్ధి కార్యకలాపాలు కొనసాగడం, అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే పదార్థాల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నట్లు వస్తున్న నివేదికలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని IAEA డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సీ తెలిపారు.
అయితే IAEA అధికార పరిధిని ఉత్తర కొరియా పలుమార్లు తిరస్కరించింది.
అణ్వాయుధ దేశంగా తమ హోదా ఇక మారదని గత సెప్టెంబరులో వియన్నాలోని ఐక్యరాజ్యసమితి వద్ద ఉత్తర కొరియా ప్రతినిధి బృందం పేర్కొంది.
అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధికి వెలుపల ఉన్న అణ్వాయుధ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే చట్టపరమైన హక్కు IAEAకు లేదని కూడా ఉత్తర కొరియా స్పష్టం చేసింది.