Finland School Firing: ఫిన్లాండ్ పాఠశాలలో కాల్పులు.. ఒక విద్యార్థి మృతి, ఇద్దరికీ గాయాలు
దక్షిణ ఫిన్లాండ్లోని ఓ సెకండరీ స్కూల్లో మంగళవారం 12 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల ఘటనతో పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని హెల్సింకీ శివార్లలోని వంతా నగరంలో దాదాపు 800 మంది విద్యార్థులున్న సెకండరీ స్కూల్లో కాల్పులు జరిగినట్లు ఉదయం 9 గంటలకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పాఠశాలను చుట్టుముట్టారు. నిందితుడి వయస్సు 12 ఏళ్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిని హెల్సింకి ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫిన్లాండ్ పాఠశాలల్లో కాల్పుల ఘటనలు
అతడి వద్ద తుపాకీ లభ్యమైంది. గాయపడిన విద్యార్థుల ప్రస్తుత పరిస్థితిపై వివరాలు విడుదల కాలేదు. ఈ మొత్తం ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. నిందితుడిపై హత్య,హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కాల్పుల సమయంలో విద్యార్థులంతా తరగతి గదుల్లో ఉన్నారు. పాఠశాలల్లో కాల్పుల ఘటనలు ఫిన్లాండ్లో గతంలోనూ జరిగాయి. సెప్టెంబర్ 2008లో,నైరుతి ఫిన్లాండ్లోని కళాశాలలో 22 ఏళ్ల విద్యార్థి పిస్టల్తో కాల్పులు జరిపి,10 మందిని చంపి,ఆపై తనను తాను కాల్చుకున్నాడు. 2007లో తుసులా నగరంలోని ఓ పాఠశాలలో 18ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 8మంది మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. అనంతరం నిందితుడు కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.