Page Loader
Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌
'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

Pakistan:'మా ప్రధాని పిరికివాడు'.. పార్లమెంటులో పాక్‌ ఎంపీ ఫైర్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 09, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో పాకిస్థాన్‌లో కలకలం రేగింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్థాన్‌ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది. భారత్‌పై విఫల దాడుల యత్నాలకు పాల్పడుతోంది. అయితే భారత బలగాలు పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో పాటు, ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేశాయి. ఈ పరిణామాలతో పాక్‌ లోపల ఆగ్రహావేశాలు చెలరేగుతున్నాయి. ప్రజలు, రాజకీయ నాయకులు తమ ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తున్నారు. తాజాగా తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ ఎంపీ షాహిద్ అహ్మద్ పార్లమెంట్‌లో ఉద్ధృత వ్యాఖ్యలు చేశారు.

Details

నరేంద్ర మోదీ పేరే పలకలేని స్థితిలో ఉన్నాడు

ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను 'పిరికివాడి'గా అభివర్ణించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరే పలకలేని స్థితిలో ఉన్నారని ఆరోపించారు. టిప్పు సుల్తాన్‌ మాటలు ఉటంకిస్తూ.. సింహాల సైన్యాన్ని నక్క నడిపితే, అవి ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. తమ సైనికులు ధైర్యంగా పోరాడాలనుకున్నా, ప్రధానికే ధైర్యం లేకపోతే వారు ముందుకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. భారత్‌ దాడులు చేసినప్పటి నుంచి ప్రధాని ఒక్క ప్రకటన కూడా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ప్రభుత్వం ఏం ఆదేశాలు ఇస్తుందనే ప్రశ్నను లేవనెత్తారు.

Details

పాక్ దాడులను తిప్పికొట్టిన భారత్

ఇంతలో, భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పాకిస్థాన్‌ గురువారం రాత్రి దాడులకు యత్నించింది. జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో పలు డ్రోన్లను పంపించింది. అయితే భారత బలగాలు ముందస్తుగా అప్రమత్తమై వాటిని సమర్థంగా తిప్పికొట్టాయి. ఉధంపుర్‌, సాంబా, జమ్ము, అఖ్నూర్‌, నగ్రోటా, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పాక్‌ ప్రయోగించిన 50 డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. ఇది భారత్‌ సైనిక శక్తి, గగనతల రక్షణ సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.