Pakistan: మసూద్ అజార్పై పాక్ భారీ రివార్డ్.. ఆచూకీ తెలిపితే రూ.70 లక్షలు!
ఈ వార్తాకథనం ఏంటి
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నా.. ఇస్లామాబాద్ మాత్రం ఆ విషయాన్ని అంగీకరించడం లేదు. అతడు పాకిస్థాన్లో లేడని ప్రపంచాన్ని నమ్మించేందుకు తాజాగా మరో ప్రకటన చేసింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) తన 'మోస్ట్ వాంటెడ్' ఉగ్రవాదుల 'రెడ్ బుక్'లో మసూద్ అజార్ పేరును చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు (PKR) బహుమతిగా ప్రకటించింది. అయితే.. మసూద్ అజార్ను పట్టిస్తే 50 లక్షల పాకిస్థానీ రూపాయలు ఇస్తామని పాకిస్థాన్ ఐదేళ్ల క్రితమే ప్రకటించింది.
వివరాలు
అంతర్జాతీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకేనా?
ఇప్పుడు ఆ మొత్తానికి మరో 20 లక్షల పాకిస్థానీ రూపాయలు జోడించి.. తాజాగా మరోసారి బహుమతి ప్రకటన చేసింది.
అక్టోబర్లో జరగనున్న ఆర్థిక చర్యల కార్యదళం (Financial Action Task Force-FATF) సర్వసభ్య సమావేశానికి ముందు పాకిస్థాన్ ఈ తరహా ప్రకటన చేయడం గమనార్హం.
ఉగ్రవాదులపై పాకిస్థాన్ చర్యలు తీసుకుంటోందనే అభిప్రాయాన్ని ప్రపంచ దేశాల్లో కలిగించడం ద్వారా.. అంతర్జాతీయ స్థాయిలో ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకే ఆ దేశం ఈ ప్రకటన చేసి ఉండొచ్చని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మసూద్ అజార్ అఫ్గానిస్థాన్లో తలదాచుకున్నాడని పాకిస్థాన్ 2021 నుంచి చెబుతూ వస్తోంది.
వివరాలు
ఆరోపణలను కొట్టిపారిసిన పాకిస్థాన్
అయితే ఈ ఆరోపణలను అఫ్గానిస్థాన్ కొట్టిపడేసింది. మరోవైపు.. మసూద్ అజార్ పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉన్న నవాబ్షాలో ఉన్నట్లు భారత నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తాజాగా అతడి పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి, ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ప్రకటించడం గమనార్హం.
వివరాలు
రెడ్ బుక్లో 26/11 నిందితుల పేర్లు కూడా
పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) విడుదల చేసిన రెడ్ బుక్లో 26/11 ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధమున్న 19 మంది ఉగ్రవాదుల పేర్లు కూడా ఉన్నాయి.
అయితే.. వారందరూ పాకిస్థాన్లోనే దాక్కున్నారని, అంతర్జాతీయ పరిశీలన నుంచి దృష్టి మళ్లించేందుకే ఇస్లామాబాద్ వారిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చిందని భారత్ వాదిస్తోంది.
వివరాలు
భారత్లో పలు భీకర దాడులకు సూత్రధారి
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత అయిన మసూద్ అజార్.. భారత్లో జరిగిన పలు భీకర దాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
1995లో భారత్ మసూద్ అజార్ను అరెస్టు చేసింది. అయితే 1999లో కొందరు ఉగ్రవాదులు ఓ విమానాన్ని హైజాక్ చేసి, అతడిని విడిపించుకున్నారు.
ఆ తర్వాత మసూద్ అజార్ జైషే మహ్మద్ ఉగ్ర ముఠాను స్థాపించాడు. 2001లో భారత పార్లమెంట్పై జరిగిన ఉగ్రదాడి, 2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ మసూద్ అజార్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
అతడిని 2019లో ఐక్యరాజ్యసమితి (ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది