Pakistan: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో అగ్రరాజ్యాన్ని శరణు వేడిన దాయాది దేశం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో.. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది! "ఎలాగైనా భారత్ను ఆపండి ప్లీజ్" అని వేడుకుంటూ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 భేటీలు నిర్వహించింది. ఈ క్రమంలో, అమెరికాలోని పాకిస్తాన్ రాయబారులు, రక్షణ శాఖ అధికారులు, అమెరికా చట్టసభల సభ్యులు, విదేశాంగ శాఖ అధికారులు, పెంటగాన్ అధికారులు అన్ని వర్గాలతో పదేపదే భేటీలు, ఫోన్ కాల్స్, ఈమెయిళ్లు నిర్వహించారు. అన్ని సాధ్యమైన మార్గాల్లో తమను కాపాడుకోడానికి, భారత దాడులను అడ్డుకోవటానికి ప్రణాళికలు రూపొందించారు.
వివరాలు
5 మిలియన్ డాలర్ల ఒప్పందాలు
అంతేకాక, ప్రధాన మీడియా సంస్థల పాత్రికేయులను సంప్రదించి, ఇంటర్వ్యూలు, బ్యాక్గ్రౌండ్ బ్రీఫింగ్స్ ఇస్తామని కూడా పాకిస్తాన్ ముందడుగు వేసింది. ఈ వివరాలు 'యూఎస్ ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (FARA)' పత్రాలు ద్వారా బయటపడ్డాయి. కానీ ఇది ఒక్కసారిగా కాకుండా, ట్రంప్ పాలనలో వాణిజ్య, దౌత్య ప్రయోజనాలను సాధించుకోవడానికి పాకిస్తాన్ వెంటనే వేగవంతమైన సంప్రదింపులు కొనసాగించింది. వాషింగ్టన్లోని ఆరు ప్రముఖ లాబీ సంస్థలతో పాకిస్తాన్ వార్షికంగా 5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.45 కోట్లు) ఒప్పందాలు కుదుర్చుకుంది.
వివరాలు
భారత్ ఖర్చు చేసిన దానికన్నా పాక్ మూడు రెట్లు ఎక్కువ ఖర్చు
ఈ ఒప్పందాల క్రమంలో, 'సీడెన్ లా ఎల్ఎల్పీ' అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని వారాలకే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ను శ్వేతసౌధంలో ఆతిథ్యం ఇచ్చారని అందులో పేర్కొంది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఏప్రిల్-మే నెలల్లో అమెరికాలో లాబీయింగ్కు భారత్ చేసిన ఖర్చుతో పోలిస్తే, పాకిస్తాన్ ఖర్చు మూడు రెట్లు ఎక్కువ చేసింది. అదనంగా, ట్రంప్ను బహిరంగంగా ప్రశంసించడం, ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయించడం వంటి చర్యలు, పాక్-అమెరికా సంబంధాలను మరింతగా బలపరిచాయి.