US-Iran: 45 రోజుల సీజ్ఫైర్కు పాక్ ప్రయత్నం.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం సందేహమే
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడుతుండగా,అమెరికా, ఇరాన్ పలు ప్రాంతీయ మధ్యవర్తులు కలిసి 45 రోజుల కాల్పుల విరమణకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. పాక్ నేతృత్వంలోని ఈ చర్చలు కీలక దశకు చేరుకున్నప్పటికీ, ఒప్పందం కుదిరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం. వచ్చే 48 గంటల్లో ఎలాంటి పురోగతి సాధ్యంకాదని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ పెద్ద స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు ఇది చివరి అవకాశమని దౌత్యవేత్తలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గడువు విధించడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. మొదట సోమవారం ముగియాల్సిన గడువును 20 గంటలు పొడిగించి,మంగళవారం రాత్రి వరకు అవకాశం ఇచ్చారు.
వివరాలు
అమెరికా పలు ప్రతిపాదనలు.. అంగీకరించని ఇరాన్
చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్పినా, విఫలమైతే భారీ సైనిక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. పరదాల వెనుక పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ దేశాల ద్వారా చర్చలు సాగుతుండగా, అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి మధ్య నేరుగా సందేశాలు మారుతున్నాయి. అమెరికా పలు ప్రతిపాదనలు ఇచ్చినా,వాటిని ఇరాన్ ఇప్పటివరకు అంగీకరించలేదు. చర్చల ప్రణాళిక ప్రకారం రెండు దశల్లో ఒప్పందం ఉండే అవకాశం ఉంది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ అమలు చేసి,ఆ సమయంలో శాశ్వత శాంతి కోసం చర్చలు జరపాలి. అవసరమైతే ఈ గడువు పొడిగించే అవకాశం ఉంది.
వివరాలు
ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఇరాన్
రెండో దశలో పూర్తిస్థాయి ఒప్పందం ద్వారా యుద్ధానికి ముగింపు పలకాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రధాన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ముఖ్యంగా Strait of Hormuz పూర్తి స్థాయిలో తెరవడం, ఇరాన్ అధిక శుద్ధి యురేనియం నిల్వలపై నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు తుది ఒప్పందంలోనే సాధ్యమని మధ్యవర్తులు భావిస్తున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణలో ఇవి పరిష్కారం కావడం కష్టమని చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఈ ప్రతిపాదనపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గాజా, లెబనాన్లలో జరిగినట్లే కాల్పుల విరమణలు నిలకడగా ఉండవని పేర్కొంటూ, హోర్ముజ్పై తన నియంత్రణను లేదా యురేనియం నిల్వలను తాత్కాలిక ఒప్పందం కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేసింది.
వివరాలు
అమెరికా ప్రతిపాదనలను 'అంగీకరించలేము'
చర్చలు విఫలమైతే పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిగితే, గల్ఫ్ దేశాల ఆయిల్, నీటి సదుపాయాలపై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఇరాన్ విప్లవ గార్డుల నౌకాదళం హోర్ముజ్ పరిస్థితి యుద్ధానికి ముందు మాదిరిగా తిరిగి మారదని స్పష్టం చేసింది. ఇటీవల పాక్ మధ్యవర్తిత్వ బృందంతో జరిగిన చర్చల్లో, ఇస్లామాబాద్లో అమెరికా అధికారులతో ప్రత్యక్షంగా సమావేశం కావడానికి తాము సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. అలాగే, అమెరికా ప్రతిపాదనలను 'అంగీకరించలేము' అని కూడా తెలిపినట్లు తెలుస్తోంది.