చంద్రయాన్-3పై పాక్ నేత కీలక వ్యాఖ్యలు.. ప్రత్యేక్ష ప్రసారం చేయాలని సూచన
భారత్ ప్రయోగించిన ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 మిషన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ ఇస్రో శాస్త్రవేత్తల కృషిని పొగడ్తలతో ముంచెత్తారు. ఇవాళ సాయంత్రం ల్యాండర్ చందమామపై కాలు మోపనున్న నేపథ్యంలో దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పాక్ మీడియాను కోరారు. మరోవైపు జాబిల్లి దక్షిణ ధ్రువం(SOUTH POLE) వద్దకు ఏ దేశం కూడా విజయవంతం కాలేదు. ఈ క్రమంలోనే తమ దేశ అంతరిక్ష నౌకలను దింపలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చంద్రయాన్-3 సక్సెస్ పై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. సాయంత్రం 6.04 గంటలకు దిగనున్న ల్యాండర్ ను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
వర్చువల్గా ల్యాండింగ్ క్షణాలను తిలకించనున్న ప్రధాని మోదీ
చంద్రయాన్-3 విజయవంతం అవడంపై పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా భారత అంతరిక్ష రంగానికి ఇవి చరిత్రాత్మక క్షణాలని పేర్కొన్న ఫవాద్, ఇందుకు భారత శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెప్పారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాలంలో ఫవాద్ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేయడం గమనార్హం. చంద్రయాన్-3 యథావిధిగా ఇవాళ సాయంత్ర దిగనుందని ఇస్రో ఛైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు. అనుకోని సమస్యలు తలెత్తితేనే 27న దించుతామన్నారు. మరోవైపు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఉన్న ప్రధాని మోదీ, ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి వర్చువల్గా ల్యాండింగ్ క్షణాలను తిలకించనున్నారు.