IHRF: ఆసిమ్ మునీర్ విమర్శకులపై పాకిస్థాన్ 'విచ్ హంట్'.. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను విమర్శిస్తున్నవారిపై జరుగుతున్న చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల పాకిస్థాన్లో తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు మునీర్కు ఇంతవరకు లేనంత అధికారాలు ఇచ్చాయని, అదే సమయంలో విమర్శకులు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని గ్లోబల్ రైట్స్ గ్రూప్ హెచ్చరించింది. ఈ విషయంపై ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ (IHRF) ఎక్స్ (X) వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్ కోర్టు తాజాగా జర్నలిస్టులు, రాజకీయ వ్యాఖ్యాతలు అయిన ఆదిల్ రాజా, షాహీన్ సెహ్బాయ్, మొయీద్ పిర్జాదా, సయ్యద్ అక్బర్ హుస్సేన్లను దోషులుగా తేల్చిన తీర్పును ఈ సంస్థ ప్రస్తావించింది.
వివరాలు
IHRF ఆందోళన
విశ్వసనీయ సమాచారం ప్రకారం, వీరికి ఆరోపణల గురించి ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ఆధారాలు చూడటానికి అవకాశం కల్పించలేదని, తమ వాదన వినిపించే అవకాశం కూడా లేకుండా తీర్పులు ఇచ్చారని IHRF పేర్కొంది. ఇవాళ లక్ష్యంగా మారిన విమర్శకులంతా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు మద్దతుదారులేనని, ఆసిమ్ మునీర్పై తీవ్ర విమర్శలు చేసినవారేనని సంస్థ తెలిపింది. ఇలాంటి చర్యలు న్యాయ ప్రక్రియ, న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ హామీల అమలుపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయని IHRF ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే, పాకిస్థాన్లో ఇటీవల ఆమోదం పొందిన 26వ రాజ్యాంగ సవరణ బిల్లుతో ఈ వ్యవహారాలను పోల్చింది.
వివరాలు
రాజ్యాంగ మార్పులు
ఈ సవరణ ద్వారా ఆసిమ్ మునీర్ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (CDF) హోదా కల్పించడంతో పాటు, జీవితకాలం అరెస్ట్, క్రిమినల్ కేసుల నుంచి రక్షణ (ఇమ్యూనిటీ) కల్పించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఈ రాజ్యాంగ మార్పులు ప్రజాస్వామ్య పాలనను, మౌలిక స్వేచ్ఛలను దెబ్బతీసే ప్రమాదం ఉందని IHRF తెలిపింది. పాకిస్థాన్లో హడావుడిగా తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలు న్యాయవ్యవస్థ స్వతంత్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని, సైన్యం బాధ్యతపై, చట్ట పాలనపై సందేహాలు పెంచుతున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టర్క్ ఇప్పటికే హెచ్చరించిన విషయాన్ని సంస్థ గుర్తు చేసింది.
వివరాలు
రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా.. న్యాయవ్యవస్థలో కీలక మార్పులు
అంతర్జాతీయ న్యాయవాదుల కమిషన్ (International Commission of Jurists) కూడా పాకిస్థాన్ 26వ రాజ్యాంగ సవరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, చట్ట పాలనకు గట్టి దెబ్బగా అభివర్ణించిందని IHRF పేర్కొంది. 2024 అక్టోబర్లో ఆమోదం పొందిన ఈ 26వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయవ్యవస్థలో కీలక మార్పులు జరిగాయి. అత్యంత సీనియర్ ముగ్గురు న్యాయమూర్తుల్లో ఒకరిని చీఫ్ జస్టిస్గా ఎంపిక చేసే అధికారం పార్లమెంటరీ కమిటీకి ఇవ్వడం, న్యాయ కమిషన్ నిర్మాణాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చడం, చీఫ్ జస్టిస్ పదవీకాలాన్ని మూడేళ్లకు పరిమితం చేయడం, సుప్రీంకోర్టు సుమోటు అధికారాలను తగ్గించడం వంటి మార్పులు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ న్యాయవ్యవస్థ స్వతంత్రతను బలహీనపరుస్తాయని విమర్శకులు అంటున్నారు.
వివరాలు
న్యాయపరమైన వేధింపులు
జర్నలిస్టులు, విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే వారిపై ఉగ్రవాద నిరోధక చట్టాలను ప్రయోగించడం కూడా ఆందోళనకర ధోరణిగా IHRF పేర్కొంది. దీనిని 'న్యాయపరమైన వేధింపులు'గా అభివర్ణించింది. ఇదే సమయంలో, విదేశాల్లో నివసిస్తున్న ఆసిమ్ మునీర్ విమర్శకులపై కూడా దాడులు జరుగుతున్నాయని సంస్థ తెలిపింది. అమెరికాలో నివసిస్తున్న పాకిస్థానీ జర్నలిస్ట్ మొయీద్ పిర్జాదా ఇంట్లో గత వారం అనుమానాస్పదంగా అగ్నిప్రమాదం జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే యూకేలో పాకిస్థాన్ సైనిక వ్యవస్థను విమర్శిస్తున్న ఆదిల్ రాజా, షెహజాద్ అక్బర్ల ఇళ్లపై దాడులు, చొరబాట్లు జరిగినట్టు సమాచారం వెలుగులోకి వచ్చింది.