Loading...
Pakistan,Saudi Arabia,Turkey :పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?
పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?

Pakistan,Saudi Arabia,Turkey :పాక్-సౌదీ-టర్కీ రక్షణ ఒప్పందం.. 'ఇస్లామిక్ నాటో' దిశగా కీలక అడుగు?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు శుక్రవారం సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా మూడు ప్రధాన ముస్లిం దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలపడనుంది. ప్రాంతీయ భద్రతా అంశాలపై అవగాహన ఉన్న వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ సమాచారం వెల్లడించింది. అయితే ఈ ఒప్పందం కింద ఒక్కో దేశం ఏయే బాధ్యతలు చేపడుతుందనే అంశంపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. టర్కీకి చెందిన ఓ ఉన్నతాధికారి కూడా ఈ సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు జరగనున్న విషయాన్ని ధ్రువీకరించినట్లు సమాచారం.

వివరాలు 

జెడ్డాలో కీలక భేటీ.. వ్యూహాత్మక ఒప్పందంపై ప్రపంచ దృష్టి

ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్, పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కలిసి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్‌తో సమావేశం కానున్నట్లు సమాచారం.

టర్కీ ఇప్పటికే నాటో సభ్యదేశంగా ఉండగా, సౌదీ అరేబియా అమెరికాకు అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారుల్లో సౌదీ అరేబియా ఒకటి. మరోవైపు అణ్వాయుధాలు కలిగిన ఏకైక ముస్లిం దేశంగా పాకిస్థాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈ నేపథ్యంలో మూడు దేశాల మధ్య కుదరనున్న రక్షణ ఒప్పందానికి వ్యూహాత్మకంగా అధిక ప్రాధాన్యం ఏర్పడింది.

వివరాలు 

గల్ఫ్ భద్రతా ఆందోళనలతో వేగం పుంజుకున్న చర్చలు

ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ ప్రాంత భద్రతా వ్యవస్థల్లో ఉన్న బలహీనతలు వెలుగులోకి వచ్చాయి.

అదే సమయంలో హార్ముజ్ జలసంధి ద్వారా చమురు,ఇతర కీలక వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడటంతో గల్ఫ్ దేశాల్లో భద్రతాపరమైన ఆందోళనలు మరింత పెరిగాయి.

ఈ పరిస్థితుల మధ్యే మూడు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి.

ఈ రక్షణ ఒప్పందంపై గత ఏడాది నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఈ చర్చలపై రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ADVERTISEMENT

వివరాలు 

పాత రక్షణ ఒప్పందానికే విస్తరణ

అదే సమయంలో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ కూడా విస్తృత ప్రాంతీయ భద్రతా వేదిక ఏర్పాటుకు తమ దేశం మద్దతు ఇస్తుందని,దాని ద్వారా పరస్పర సహకారం,ప్రాంతీయ స్థిరత్వాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ప్రతిపాదిత త్రైపాక్షిక రక్షణ ఒప్పందం, ఇప్పటికే పాకిస్థాన్-సౌదీ అరేబియా మధ్య అమల్లో ఉన్న రక్షణ సహకారానికి విస్తరణగా భావిస్తున్నారు.

గత ఒప్పందం ప్రకారం భాగస్వామ్య దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, అది రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఒప్పందంపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు 

అవసరమైతే అందుబాటులో ఉన్న అన్ని సైనిక వనరులను వినియోగించుకునే అవకాశం కూడా అందులో ఉందని గతంలో సౌదీ అధికార వర్గాలు రాయిటర్స్‌కు వెల్లడించాయి.

అయితే తాజా త్రైపాక్షిక రక్షణ ఒప్పందంపై పాకిస్థాన్ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు.

సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న ఈ వ్యూహాత్మక పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT