PM Modi: జోర్డాన్ రాజుతో ప్రధాని మోదీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్కు చేరుకున్నారు. అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 ఇబిన్ అల్ హుసేన్తో ఆయన సౌహార్దపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్-జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలతో పాటు, పలు ప్రాంతీయ,అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. గాజా సంక్షోభంలో అబ్దుల్లా-2 కీలకంగా, చురుకైన పాత్ర పోషించిన తీరు ప్రశంసనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వాణిజ్యం, ఎరువుల రంగం, డిజిటల్ సాంకేతికత వంటి అనేక విభాగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టంచేశారు. అంతకు ముందు అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
వివరాలు
జోర్డాన్కు భారత ప్రధాని రావడం గత 37 ఏళ్లలో ఇదే మొదటిసారి
భారత్-జోర్డాన్ దౌత్య సంబంధాలకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సమయంలో ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత ప్రధాని పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం జోర్డాన్కు రావడం గత 37 ఏళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వాణిజ్య పరంగా భారత్ జోర్డాన్కు మూడో అతిపెద్ద భాగస్వామిగా నిలుస్తోంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు 280 కోట్ల డాలర్లకు చేరుకుంది. భారత్కు అవసరమైన ఎరువులను జోర్డాన్ పెద్ద ఎత్తున సరఫరా చేస్తోంది. అలాగే జోర్డాన్లో సుమారు 17,500 మంది భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు.