PM Modi: ఏఐ విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకువెళ్లాలి: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కృత్రిమ మేధ (ఏఐ) అంశంలో అన్ని దేశాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఏఐతో వచ్చే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాలని హెచ్చరించారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ, పారిస్లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా హాజరై, పలు దేశాధినేతలు, టెక్నాలజీ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు .
"ఏఐ ప్రభావంతో మన రోజువారీ పనుల్లో మార్పులు అనివార్యం. సాంకేతికత ఉద్యోగాలను తీసుకుపోతుందనుకోవడం తప్పు. నైపుణ్యాన్ని పెంచుకునే వారికి మాత్రమే మెరుగైన అవకాశాలు లభిస్తాయి. భారత్ డిజిటల్ మార్కెట్, వాణిజ్యం రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోంది," అని ప్రధాని మోదీ అన్నారు.
వివరాలు
ఆవిష్కరణలను ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి
"పాలన అంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడం, ప్రమాదాలను అరికట్టడం మాత్రమే కాదు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.ఆవిష్కరణలను ప్రపంచ ప్రయోజనాల కోసం ఉపయోగించాలి," అని ఆయన సూచించారు.
అంతేకాకుండా, సైబర్ సెక్యూరిటీ, డీప్ఫేక్స్, తప్పుడు సమాచారంపై కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
సాంకేతికతను అందరికీ అందుబాటులో ఉంచే విధంగా, ప్రజా ప్రాధాన్యతను కేంద్రంగా ఉంచుకుని అప్లికేషన్లు అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.