Russia-Ukraine War: ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా రష్యా .. 420 డ్రోన్లు, 39 క్షిపణులతో భారీ దాడి
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్లీ ఉధృతమైంది. బుధవారం అర్ధరాత్రి సమయంలో రష్యా సైన్యం ఉక్రెయిన్లోని ఎనిమిది ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని భారీ స్థాయిలో దాడులకు దిగింది. మొత్తం 420 డ్రోన్లు, 39 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. వీటిలో 11 బాలిస్టిక్ మిసైళ్లు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ దాడుల వల్ల పలువురు ఉక్రెయిన్ పౌరులు గాయపడ్డారు. గాయపడిన వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారని అక్కడి వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో తమ వైపుకు దూసుకొచ్చిన 17 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
వివరాలు
ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధంలో 75 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా వాలంటీర్లు
మరోవైపు యుద్ధంలో మరణించిన దాదాపు వెయ్యిమంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను తమ దేశానికి అప్పగించినట్లు రష్యా అధికారి వ్లాదిమిర్ మెదిన్స్కీ వెల్లడించారు. దీనికి ప్రతిగా 35మంది రష్యా సైనికుల మృతదేహాలను ఉక్రెయిన్ కూడా అందజేసిందని తెలిపారు. అయితే ఈ మృతదేహాల మార్పిడి ఎప్పుడు జరిగినదన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే,ఉక్రెయిన్ తరఫున విదేశీయుల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని సమాచారం. రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ 'టాస్' ప్రచురించిన కథనం ప్రకారం,75 దేశాలకు చెందిన 10 వేల మందికి పైగా వాలంటీర్లు ఉక్రెయిన్కు మద్దతుగా యుద్ధంలో పాల్గొంటున్నారు. ప్రతి నెల సుమారు 600 మంది కొత్త విదేశీయులు కీవ్ ప్రభుత్వానికి అనుకూలంగా భూమిపై జరిగే పోరాటాల్లో చేరేందుకు నమోదు చేసుకుంటున్నారని ఆ కథనం వెల్లడించింది.
వివరాలు
మాస్కో తరఫున యుద్ధరంగంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు
ఇక ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి రొనాల్డ్ లమోలా వెల్లడించారు. రిక్రూట్మెంట్ పేరుతో మోసపోయి వారు రష్యాకు వెళ్లినట్లు తెలిపారు. అనంతరం మాస్కో తరఫున యుద్ధరంగంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు.