Russia: భారత్ కోసం రష్యా భారీ ప్లాన్.. హిందూ మహాసముద్రానికి రైలు అనుసంధానం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి భారత్కు కొత్త రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై మాస్కో దృష్టి సారించింది. ఇందులో భాగంగా రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే అనుసంధానం ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని భావిస్తోంది. వ్యూహాత్మక సముద్ర మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, భారత్కు ప్రత్యామ్నాయ రవాణా మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఈ ప్రతిపాదన ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బోస్ఫోరస్,హర్మూజ్ జలసంధుల మీదుగా జరిగే సముద్ర రవాణా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. బోస్ఫోరస్ జలసంధి తుర్కియే నియంత్రణలో ఉండగా..హర్మూజ్ జలసంధి ఇరాన్ ఆధీనంలో ఉంది. ముఖ్యంగా మధ్యాసియాలో ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ మార్గంలో నౌకలరాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. ఈపరిస్థితులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల అవసరాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి.
వివరాలు
రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ కీలక ప్రతిపాదన
ఈ నేపథ్యంలో రష్యా ఉప ప్రధాని మరట్ ఖుస్నులిన్ కీలక ప్రతిపాదన చేశారు.
హిందూ మహాసముద్రం వరకు రైల్వే అనుసంధానం సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు.
బోస్ఫోరస్, హర్మూజ్ జలసంధుల వద్ద భద్రతాపరమైన ముప్పులు తలెత్తిన సందర్భంలో.. తుర్క్మెనిస్థాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
భారత్తో అనుసంధానం కల్పించే ఏ మార్గమైనా తమకు ఆమోదయోగ్యమేనని ఖుస్నులిన్ తెలిపారు.
ఈ రైల్వే మార్గం ద్వారా సముద్ర రవాణాపై ఉన్న ఆధారాన్ని కొంతవరకు తగ్గించుకోవడంతో పాటు, రష్యా-భారత్ మధ్య సరుకు రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను రష్యా అధికారిక వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.