Gulf Operation: ఇరాన్పై గల్ఫ్ దేశాల సీక్రెట్ ఆపరేషన్?.. బహ్రెయిన్, కువైట్ వైమానిక దాడులపై సంచలన కథనం!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. యుద్ధం నేరుగా ఈ దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ, దాని ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా పడుతోంది. అమెరికా దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. తాము అమెరికా బేస్లనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇరాన్ చెబుతున్నప్పటికీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి గల్ఫ్ దేశాల ప్రతిష్ఠపై అంతర్జాతీయంగా ప్రభావం పడుతోంది.
వివరాలు
ఇరాన్పై తొలిసారి బహ్రెయిన్, కువైట్ దాడులు?
ఈ నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ దేశాలు తొలిసారి ఇరాన్పై ప్రత్యక్ష వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా మీడియా సంచలన కథనం వెలువరించింది.
గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్ తమ రక్షణ అవసరాల కోసం ప్రధానంగా అమెరికాపై ఆధారపడుతున్నాయి.
ఈ రెండు దేశాల వైమానిక దళాలు పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, వాటి వద్ద ఉన్న యుద్ధ విమానాలు అమెరికా, ఐరోపా దేశాల నుంచి సమకూరినవే.
వివరాలు
యూఏఈ నిఘా సహకారంతో రహస్య ఆపరేషన్
ఇరాన్ నుంచి తరచూ జరుగుతున్న దాడులకు ప్రతిస్పందించాలని బహ్రెయిన్, కువైట్ నిర్ణయించినట్లు కథనం పేర్కొంది.
ఈ చర్యలో యూఏఈ కీలక పాత్ర పోషించిందని, ఇరాన్లోని లక్ష్యాలకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అందించిందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో జులై ప్రారంభంలో ఇరాన్లోని డ్రోన్, క్షిపణి నిల్వ కేంద్రాలపై బహ్రెయిన్, కువైట్ యుద్ధ విమానాలు దాడులు నిర్వహించినట్లు అమెరికా మీడియా పేర్కొంది.
ఈ రహస్య ఆపరేషన్ ప్రారంభ దశలో సౌదీ అరేబియా కూడా యూఏఈతో కలిసి పనిచేసిందని, అయితే అనంతరం తన వైఖరిని పునరాలోచించి వెనక్కి తగ్గినట్లు కథనంలో పేర్కొన్నారు.
రహస్యంగా జరిగిన ఈ ఆపరేషన్ పశ్చిమాసియా యుద్ధం మరింత విస్తరించే ప్రమాదానికి సంకేతంగా మారిందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
హర్మూజ్ ఘటన తర్వాత మరింత ఉద్రిక్తత
రెండు వారాల క్రితం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడంతో పశ్చిమాసియా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్, కువైట్ కూడా ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్నాయి.
అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా శుక్రవారం బహ్రెయిన్, కువైట్తో పాటు జోర్డాన్పైనా ఇరాన్ దాడులు జరిపినట్లు సమాచారం.
మరోవైపు అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పాటు సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారుల మధ్య కూడా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
హూతీలు ఎర్ర సముద్రంలో దిగ్బంధనాన్ని ప్రకటించి సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.